అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులను మోహరించారు. ఇటీవల జరిగిన ఘటనలను పురస్కరించుకుని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి సోమవారం నిరవధిక దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభాకరరెడ్డి దీక్షకు మద్దతుగా ఆయన సోదరుడు, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి పాల్గొంటున్నట్లు ప్రకటించారు. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జేసీ దివాకరరెడ్డి పిలుపు ఇచ్చారు. అయితే ప్రస్తుతం పట్టణంలో సెక్షన్ 144, కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో సభలు, సమావేశాలు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పోలీసుల అనుమతి లేకపోయినా తాము దీక్ష కొనసాగిస్తామని జెసి ప్రభాకరరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
ఇటీవల తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో ప్రభాకరరెడ్డి ఇంటి మీదకు వెళ్లడం, ఆ తరువాత ఇరువర్గాలకు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ తదితర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే. ఆ రోజు నుండి తాడిపత్రిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా సెక్షన్ 144 అమలు అవుతోంది.