దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఇక్కడ పోటీలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్ ,బీజేపీలు రెండు మూడు స్థానాల కోసం మాత్రమే పోటీ పడుతున్నాయి తప్ప గెలుపు కోసం కాదన్నది వారి విశ్లేషణ.
ప్రతిపక్షాలకు అందనంత వేగంతో ‘కారు” దూసుకుపోతోందట.సహజంగానే గొప్ప ఎన్నికల్లో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. అసలే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అందెవేసిన చెయ్యి.టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికవడంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. ఇక తన సిట్టింగ్ స్థానాన్ని ఆ పార్టీ నిలుపుకోవటం పెద్ద విషయం కాదు .పైగా సిటింగ్ ఎమ్మెల్యే మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి టిఆర్ఎస్ అభ్యర్థికి ఆ సానుభూతి కూడా తోడవుతుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికే మరణించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్యకే టీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది .ఇప్పటికే మంత్రి హరీష్ దుబ్బాకలో మకాం వేసి టిఆర్ఎస్కు పూర్తి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
ఏ విధంగా చూసినా దుబ్బాకలో టిఆర్ఎస్ గెలవడం దాదాపు ఖాయమైపోయింది .అయినప్పటికీ పోటీకి దిగి కాంగ్రెస్ , బిజెపిలు జబ్బలు లు చరుస్తుండడ౦ విశేషం.నిజంగా టీఆర్ఎస్ ని ఎదుర్కోగల సత్తా ఈ పార్టీలకు ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది.పైగా ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతకు టిక్కెట్టు టికెట్ ఇవ్వడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలోనూ అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నర్సారెడ్డిని అనుకున్నారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా ఆయనకే మద్దతు ఇవ్వటం.. ఢిల్లీకి సైతం ఆయన పేరే పంపుతున్నట్లుగా ప్రచారం జరిగింది.అనూహ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావటంతో ఆయనకు టికెట్ ను కన్ఫర్మ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి అసమ్మతి సెగ తగిలే అవకాశం ఉంది. టిక్కెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఎంత వరకు సహకరిస్తారో చూడాలి.
టీఆర్ఎస్ నించి వచ్చిన అభ్యర్థి కాబట్టి ఆయన ఆ పార్టీ ఓట్లు చీలుస్తారనే కాంగ్రెస్ లెక్కలు వేస్తోంది.అదే సమయంలో అసమ్మతి కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్ రెడ్డికి హాండిస్తే అన్ని ఓట్లు పోతాయి.ఈ లెక్కలను బట్టి చూస్తే టిఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన నష్టమేమీ లేదు.ఇక బీజేపీ నుంచి రఘునందనరావును డిసైడ్ చేశారు. గత ఎన్నికల్లో ఓడిన ఆయన మరోసారి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ఓడిన నేపథ్యంలో తనపై ఉండే సానుభూతి ఏమైనా వర్కువుట్ అవుతుందా? అన్నది ప్రశ్న.నిజానికి కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థుల్లో ఎవరికి గెలుపు మీద ఆశలు పెద్దగా లేవన్న మాట బలంగా వినిపిస్తోంది.వారిద్దరూ రెండు మూడు స్థానాల కోసమే పోటీ పడ్డం తప్ప గెలుపు గుర్రం ఎక్కే అవకాశమే లేదంటున్నారు.అయితే గత ఎన్నికలలో కన్నా టీఆర్ఎస్ మెజారిటీ ని తగ్గించటానికి ప్రయత్నించడం తప్ప కాంగ్రెస్ బిజెపిలు చేసేదేమీ లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.