‘ద హిందూ’ ఆంగ్ల దినపత్రిక రఫేల్ స్కామ్పై శుక్రవారం ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. దాని ఆధారంగా కాంగ్రెస్, సిపిఎం మోదీ ప్రభుత్వంపై దాడికి దిగాయి. భారత వైమానిక దళం కోరిన ఏడు స్వ్కాడ్రన్ల (126 విమానాలు) ఫైటర్ జెట్స్ కాకుండా కొనుగోలును కేవలం 36 విమానాలకే పరిమితం చేసి మోదీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో రాజీ పడిందని మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం ట్విట్టర్లో విమర్శించారు.
యుపిఎ ప్రభుత్వం హయాంలో 126 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇండియా వైమానిక దళం కోరిన మార్పులు చేయడానికి రఫేల్ యుద్ధవిమానాల కంపెనీ ‘దస్సాల్ట్ ఏవియేషన్’ అంగీకరించింది. అందుకు ఒక్కసారి చెల్లింపు కింద కొంత మొత్తం చెల్లించేందుకు ఇండియా అంగీకరించింది. ఆ ఒప్పందం కింద దస్సాల్ట్ 18 ఫైటర్ జెట్స్ పూర్తి స్థాయిలో తయారు చేసి ఇస్తుంది. మిగతా 108 విమానాలు ఇండియాలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్తాన్ ఎయిరోనాటిక్స్లో దస్సాల్ట్ సాంకేతిక బదిలీతో తయారవుతాయి.
ఈ ఒప్పందంపై చర్చలు చివరి దశలో ఉండగా 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లి 126 విమానాలకు బదులు 36 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు అక్కడ ప్రకటించారు.
‘ద హిందూ’ పత్రిక కథనం సారాంశం ఏమంటే ఇండియా కోరిన మార్పుల తాలూకూ ఖర్చు 126 విమానాలకు బదులు 36 విమానాలకే చెల్లించాల్సి వచ్చేసరికి ఆ ఖర్చు ఒక్కో విమానానికి 11.11 మిలియన్ యూరోల నుంచి 36.11 మిలియన్ యూరోలకు పెరిగింది. ఫలితంగా మొత్తం మీద ఒక్కో ఫైటర్ జెట్ ఖరీదు 90.41 మిలియన్ యూరోల నుంచి 127.86 మిలియన్ యూరోలకు పెరిగింది. ఈ పెంపుదల 41.4 శాతం.
రఫేల్ డీల్కు సంబంధించిన అన్ని పత్రాలూ తమ దగ్గర ఉన్నాయనీ, వాటిని బహిర్గతం చయడం లేదనీ ద హిందూ పేర్కొన్నది. రక్షణ పరికరాల సమీకరణ మండలి ఛైర్మన్ హోదాలో రక్షణ మంత్రి మనహర్ పరికర్ ఈ ఒప్పందంపై నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఆయన దాని జోలికి పోకుండా తన పై స్థాయిలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి నివేదించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆ కమిటీ ఒప్పందాన్ని ఆమోదించింది.
తన ఆశ్రిత వాణిజ్యవేత్తకు సహాయం చేసేందుకే మోదీ హడావుడిగా రఫేల్ ఒప్పందాన్ని మార్చి కుదుర్చుకున్నారనీ, ఆ క్రమంలో దేశ రక్షణను బలి పెట్టారనీ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ట్వీట్ చేశారు. అసలు విషయం బయటపడిపోయిందనీ, ఇక ఎన్ని అబద్ధాలు వల్లించినా కుదరదనీ ఆయన వ్యాఖ్యానించారు.