ఓ ఇంట్లో నలుగురు చనిపోయారు. ఆ ఇంటి వెనుక భాగంలో తవ్వకాలు చేపట్టడం, నిమ్మకాయలు లాంటి వివిధ వస్తువులు ఘటనా స్థలంలో
లభించడంతో నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం కలకలం రేపింది. వారి మీద విషప్రయోగం జరిగినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. విష ప్రయోగం జరిగిందా..?ఎంతమంది అక్కడ తవ్వకాలు జరిపారు..?ఇందులో ఎవరెవరి హస్తం ఉంది..? అనేది ఆరా తీస్తున్నారు.
గ్రామస్తులు, మీడియా, పోలీసుల అనధికార సమాచారం ప్రకారం, నాగపూర్ గ్రామానికి చెందని ఆర్ఎంపీ డాక్టర్ రహీం, హాజీరాబీకి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె ఆష్మాబేగానికి భర్త ఖాజా, కూతురు ఆశ్రీన్ ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా వీరన్నపేటకు చెందిన ఖాజా కొంతకాలంగా నాగర్కర్నూల్లో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. హాజీరాబీ కొన్నేళ్లుగా ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని తరచూ కుటుంబసభ్యులతో చర్చిస్తుండేది. ఈనేపథ్యంలో 2014 ఆగస్టు 12న కూడా ఇంటి ఆవరణలో వేపచెట్టు దగ్గర తవ్వకాలు జరుపగా ఎలాంటి నిధులు లభించలేదు.
అయితే, తాజాగా ఖాజా తన భార్య పిల్లలతో కలిసి నాగపూర్ గ్రామానికి చేరుకొని గురువారం రాత్రి హజీరాబీ ఇంట్లో తవ్వకాలు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఖాజా మృతదేహం ఇంటి వెనకభాగంలో తవ్వకాలు జరిపిన ప్రదేశంలో పడి ఉంది. ఈమేరకు గ్రామస్తులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మృతుడు ఖాజా మృతదేహం ఇంటి వెనకభాగంలో తవ్వకాలు జరిపిన ప్రదేశంలో పడి ఉంది. ఇతని పక్కనే నిమ్మకాయలు, కొబ్బరికాయ, గులాబీ పూలు, ఒక కత్తి పడి ఉన్నాయి. పడకగదిలో కూతురు ఆష్మాబేగం ఉండగా ఈమె మృతదేహం పక్కన అత్తర్, లోబాన్ ఊదు, కర్పూరాలు వంటి సామగ్రి ఉన్నాయి. ఇదిలాఉండగా, ఈ ఇంటి గురించి, అందులో జరిపిన క్షుద్రపూజల గురించి గ్రామస్తులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
నాగపూర్ గ్రామానికి చేరుకున్న ఎస్పీ అపూర్వరావు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతుల్లో హాజీరాం బీ(60),కూతురు ఆష్మాబేగం(35), అల్లుడు ఖాజా (42), మనవరాలు ఆశ్రీన్ (7) ఉన్నట్టుగా తెలిపారు. ఇంటి ఆవరణలో క్షుద్రపూజలు నిర్వహించినట్టుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. విచారణ చేపట్టి కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.