ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావడంతో రాష్ట్రంలో పరిస్థితులపై ఓ సర్వే చేయడం జరిగింది. ఏడాదిన్నరగా జగన్ పరిపాలన పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు..?, అదే విధంగా ఆర్థికంగా దెబ్బతిన్న కేంద్రం నుండి సరైన సపోర్టు లేకపోయినా సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు, అన్న దాని విషయం పై చేసిన సర్వేలో ఏపీ ప్రజలు మంచి మార్కులే ఇచ్చినట్లు సమాచారం. ఏపీలో జగన్ ఏడాదిన్నర పరిపాలనపై వీడీపీ అసోసియేట్స్ ఆర్ అండ్ డీ విభాగం చేసిన సర్వేలో సీఎం జగన్ కి తిరుగులేదని తేలిందట.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో 50 శాతం ఓటింగ్ తో రాష్ట్రంలో 175 స్థానాలకు గాను 151 చోట్ల వైసిపి గెలిచిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు చేసిన సర్వేలో గత ఏడాది కంటే ఓటింగ్ శాతం మరింత పెరిగినట్లు ఈ సర్వేలో బయటపడింది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి 49.95% ఓటింగ్ రాగా ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే 52.97% ఓటింగ్ వస్తదని ఈ సర్వేలో బయటపడింది. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో టిడిపి పార్టీకి 39.17% ఓట్లు పొందగా, ఇప్పుడు 40.06% ఓట్లు లభించే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది.
కాగా పార్టీ స్థాపించిన తరువాత మొట్టమొదటిసారి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన ఓటింగ్ శాతం 5.53% కాగా ఇప్పుడది 3.56కి పడిపోయింది. అదేవిధంగా బిజెపికి 2.2%, కాంగ్రెస్ పార్టీకి 0.6%, ఇతరులు 0.61 ఓట్లు శాతం దక్కించుకుంటారు అని ఈ సర్వేలో తేలింది. మొత్తంమీద చూసుకుంటే చంద్రబాబు కంటే జగన్ ఏకంగా 13 శాతం తో చాలా ముందంజలో ఉన్నట్లు విడిపి సర్వే స్పష్టం చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, బీజేపీ కలిసిన విడివిడిగా పోటీ చేసిన పెద్దగా పరిస్థితులు మారే అవకాశం లేదన్నది తేలిపోయింది. ఇక్కడ ఒక్క విషయం గమనిస్తే 2019 ఎన్నికల తర్వాత టిడిపి, వైసిపి పార్టీ ఓటింగ్ శాతం పెరగగా… జనసేన కి మాత్రం తగ్గింది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ టిడిపి తో కలిస్తే మ్యాజిక్ జరిగే అవకాశం ఉందని టీడీపీ తమ్ముళ్లు నమ్ముతున్నారు.