మొదటినుంచి భిన్నమైన రాజకీయ వేత్తగా గుర్తింపు పొంది, ఆ గుర్తింపుతోనే రికార్డు స్థాయి విజయం సొంతం చేసుకున్న వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కొత్త టాక్ వినిపిస్తోంది.
ఆయన కొందరిని హర్ట్ చేశారట. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతలు వైఎస్ జగన్, ఆయన పార్టీ తీరుతో తెగ ఫీలవుతున్నారని అంటున్నారు. అసలు ఎందుకు ఫీలవుతున్నారో తెలిస్తే, ఇంకా ఆశ్చర్యపోతారు.
వైసీపీ నేతల టాక్ ఏంటంటే….
అదేం చిత్రమో కానీ…గత కొద్దిరోజులుగా ఓ టాక్ పెద్ద ఎత్తున జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలుస్తున్నారు అంటే పొత్తు కోసమే అన్నది సదరు జోస్యం సారాంశం. ఇటీవల జరిగిన భేటీ సమయంలో అయితే ఈ పొత్తు ఎపిసోడ్ పీక్స్కు చేరింది. ఎన్డీఏలో చేరమని బీజేపీ అధిష్ఠానం అడిగిందని.. ప్రధానితో సీఎం జగన్ భేటీలోను ఇదే ప్రధాన చర్చ జరనుందని ఒకటే టాక్. ఫలానా నేతలకు మంత్రి పదవులు దక్కనున్నాయని కూడా కొందరు చెప్పేశారు. బీజేపీ కూటమిలో వైసీపీ చేరుతుందన్న ప్రచారం ఏపీ బీజేపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేసిందట. కొందరు నేతలు అసలు ఏం జరుగుతుందో క్లారిటీ రాలేకపోయారట.
ఢిల్లీ ఎంటరైంది
బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో వైసీపీ చేరుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో, సీఎం జగన్ ఢిల్లీలో ఉన్న ఆ రెండు రోజులు ఏం జరుగుతుందో అర్థంకాక తల పట్టుకున్నారట. ఢిల్లీలో తమకు తెలిసిన వారి దగ్గర ఆరా తీశారట. కొందరైతే పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ దేవధర్తోనూ మాట్లాడారట. అయితే, అలాంటిదేమీ లేదని తెలియడంతో టెన్షన్ తగ్గిందట.
ఇప్పుడు అసలు టెన్షన్
బీజేపీ కూటమిలో వైసీపీ చేరడం లేదని `ఇప్పటివరకైతే` క్లారిటీ వచ్చినప్పటికీ ఇంకా బీజేపీ నేతల టెన్షన్ తగ్గడం లేదంటున్నారు. అదేంటంటే, బీజేపీ- వైసీపీ పొత్తుల ప్రచార ప్రభావం పార్టీపై తీవ్రంగా ఉండొచ్చని కమలనాథుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఎన్డీయే కూటమిలో వైసీపీ ఇప్పటికిప్పుడు చేరకపోయినా కేంద్రానికి వైసీపీ దగ్గర అనే మెసేజ్ జనంలోకి వెళ్లిపోయిందని రాష్ట్ర బీజేపీ నాయకులు టెన్షన్ పడుతున్నారట. బీజేపీ అధిష్ఠానం దగ్గర వైసీపీకి ప్రాధాన్యం ఉందనే అభిప్రాయం అందరికీ అర్ధమైపోయిందని భావిస్తున్నారట. అయితే, వారిని కూల్ చేసేందుకు బీజేపీ ఇంఛార్జ్ దేవధర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఎన్డీఏలోకి వైసీపీ చేరిక అనేది ఆ పార్టీ మైండ్గేమ్ అని.. ఆందోళన పడొద్దని ఏపీ నేతలకు చెప్పారట. అయినప్పటికీ, జగన్ వేసే అడుగు ఏంటో తెలియక, ఈ ప్రభావం రాష్ట్రంలో కేడర్పైనా ఎలా పడనుందో అంచనా వేస్తూ ఆందోళన చెందుతున్నారట కొందరు నేతలు. అయితే, తాము ఎన్డీఏ కూటమిలో చేరడం గురించి అస్సలు ఆలోచించడం లేదని… బీజేపీ నేతలు ఈ విషయంలో టెన్షన్ పడితే తామేం చేయగలమని వైసీపీ నేతలు కొట్టిపారేస్తుండటం అసలు ట్విస్ట్!.