ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే…పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రగిలిపోతున్నారనే ప్రచారం హఠాత్తుగా తెరమీదకు వచ్చింది. వాళ్లంతా పార్టీ నేతలే
అయినప్పటికీ…పార్టీ పెద్దపై ఎందుకు అసహనంగా ఉన్నారనే ప్రశ్నకు వారికి ప్రాధాన్యం దక్కకపోవడం. ఇంకా చెప్పాలంటే సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా దొరక్కపోవడం. వాళ్లంతా ఎవరంటే పార్టీ జంప్ జిలానీలు.
ఏపీలో బంపర్ మెజార్టీతో గెలిచి వైసీపీ అధికారంలోకి రావడం, టీడీపీ ఘోర పరాజయం పాలవడం తెలిసిన సంగతే. అనంతరం ఆ పార్టీలో భవిష్యత్ ఉండదని భావించిన పలువురు నేతలు అధికార పార్టీలోకి వచ్చేశారు. అలా వైసీపీ కండువా కప్పుకొన్న వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, తూర్పుగోదావరికి చెందిన తోట త్రిమూర్తులు, అనకాపల్లిలో ఎంపీగా ఓడిపోయిన గుడివాడ అమర్నాథ్, అనంతకు చెందిన యామినీ బాల, శమంతకమణి తదితరులు ఉన్నారు. ఇలాంటి నేతలే ఇప్పుడు జగన్ తీరుపై హర్టవుతున్నారట.
ఈ నేతలంతా అధికార పార్టీలో చేరిన అనంతరం తమకు పదవులు దక్కుతాయని గంపెడాశతో ఉన్నారట. అయితే, ఏపీ సీఎం జగన్ అలాంటి ఆలోచనే చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే, పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన వారికి న్యాయం చేయడంలో ఆయన ఇంకా పూర్తిగా సఫలం కాలేదు. అలాంటప్పుడు ఇలా ఓటమి తర్వాత పార్టీ మారిన వారి సంగతి ఎక్కడ? దీంతో ఈ నేతలు నిరాశ పడుతున్నారట.
మరోవైపు వివిధ రకాల పనుల కోసమో లేదంటే ఓసారి అలా మొహం చూపించి వద్దాం అని భావించో ఈ తరహా నేతలంతా ఏపీ సీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారట. అయితే వారికి సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని తెలుస్తోంది. దీంతో నిరీక్షించి నిరాశ చెందడం సదరు నాయకుల వంతు అవుతోందని టాక్ వస్తోంది. పాపం పార్టీ మారిన నేతలు!