ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే సమయంలో కొన్ని పత్రికలపై వైసీపీ నేతలు తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తుంటారు.
వాటిలో ఆంధ్రజ్యోతి ఒకటి. తాజాగా సైతం వైసీపీ ఎంపీలు ఆంధ్రజ్యోతి పత్రికపై మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివిధ అంశాలపై స్పందించారు. ఇందులో ప్రధానంగా ఆంధ్రజ్యోతిపై అసహనం వ్యక్తం చేశారు.
ముగ్గురు ఎంపీలు కలిసి….
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఢిల్లీ టూర్పై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం సరికాదని అన్నారు. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. నిరాధార, ఆసత్య కథనాలు రాయటం సరికాదని, రాష్ట్రాభివృద్ధే ఎజెండాగా సీఎం వైఎస్ జగన్ పర్యటన జరిగిందని ఎంపీలు తెలిపారు. “2014-15లో రాష్ట్రానికి రెవెన్యూలోటు ఎంత ఉంటే అంత ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.14వేల కోట్లు ఉంటే కేంద్రం రూ.5000 కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. మిగిలిన మొత్తం కూడా రిలీజ్ చేయమని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ టూర్లో కేంద్రాన్ని కోరటం జరిగింది.“ అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు.
ఆంధ్రజ్యోతిపై ఎందుకు ఇలా అంటే…
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా సహా వివిధ అంశాలను సీఎం జగన్ ప్రస్తావించారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. “హోదా కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా వచ్చిన నేపథ్యంలో సహాయక చర్యల గురించి చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ ఉన్న రూ.4000 కోట్లకు పైగా నిధులను వెంటనే రిలీజ్ చేయటానికి అమిత్ షా హామీ ఇచ్చారు. ఇటువంటి సంతోషకరమైన వార్తల్ని హైలైట్ చేయండి. అవాస్తవాలు రాసి ప్రజల్ని తప్పుదోవపట్టనివ్వొద్దు. ఓ వర్గం మీడియా నిరంతరం క్షుద్ర రాజకీయాలు రాయటం సరికాదు. ఒక్క ఆంధ్రజ్యోతి పేపర్నే ఎందుకు తప్పుపట్టాల్సి వస్తోందంటే…. ఆ పత్రిక రోజూ కట్టుకథలు రాయటం వల్లే.“ అంంటూ తమ వైఖరిని వెల్లడించారు.
మోదీ మౌనం అర్థం కావడం లేదు.
అమరావతి భూముల కుంభకోణంలో న్యాయమూర్తుల మీద ఆరోపణలు వస్తే అవి నిజమో, కాదో ఎందుకు సుమోటోగా కేసు టేకప్ చేయలేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. “న్యాయవ్యవస్థ అప్రతిష్టపాలు అయితే కచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి మీద ఉంది. ఎందుకు మౌనంగా ఉన్నారో మాకు అర్థం కావటం లేదు. మేధావులు మౌనంగా ఉంటే సమాజం పాడైపోతుంది. పోలీసులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు ఒకన్యాయం, సామాన్యులకు ఒక న్యాయం, న్యాయాధికారులకు ఒక న్యాయం అనే భావన రాకూడదు. వారు న్యాయమూర్తులు అవ్వొచ్చు. న్యాయవ్యవస్థ కించపరచాలనే ఆలోచన మాకు లేదు. న్యాయవ్యవస్థ గౌరవం పెంచాలి. అందుకోసం తప్పు ఎవరు చేసినా.. చర్యలు తీసుకోవాలి.“ అని డిమాండ్ చేశారు.
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతిపై అసహనం వ్యక్తం చేశారు. “కేంద్ర హోంమంత్రిని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కలిస్తే… ఆ సంభాషణ అంతా ఆంధ్రజ్యోతి ప్రతినిధులు డైరెక్ట్గా చూసినట్లు.. పక్కనే ఉండి విన్నట్లు ఇష్టంవచ్చినట్లు కథనం రాయటం అంటే పత్రికా విలువలను దిగజార్చడమే. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపైన వ్యతిరేక కథనాలు రాయటం ఆంధ్రజ్యోతికి కొత్తేమీ కాదు. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు నిర్వాకంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తారుమారైనా.. ఏనాడూ ఈ పత్రికలు రాయలేదు. ఇప్పుడేమో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని రాస్తున్నారు. ఇది ఎవరి పాపం అన్నది తెలియదా..?“ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని అమలు జరుపుతూ.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారంచుడుతున్నారు. అని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో దిశచట్టం ఆమోదంలో కేంద్ర హోంశాఖ సహకారం అవసరం ఉందని, రాష్ట్ర సీఎంను కేంద్ర హోంమంత్రి మందలించారని ఆంధ్రజ్యోతి అసత్య కథనాలు రాయటంపై మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా తన పాత్రను సమర్థవంతంగా పోషించాల్సింది పోయి ఇలాంటి కథనాలు సరికాదని హితవు పలికారు. గతంలో చంద్రబాబు ఢిల్లీ వస్తే ప్రధానే స్వయంగా వచ్చి ఆహ్వానించారని కథనాలు రాశారన్నారు. ఆంధ్రజ్యోతి కథనాలపై ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వెంకటరమణ హెచ్చరించారు.
రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాధినేతగా సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చినప్పుడు ఒక బాధ్యతతో వస్తారు. దీనిని కూడా వక్రభాష్యాలు చెబుతూ ఓ వర్గం మీడియా తప్పుడు కథనాలు రాయడం సబబు కాదు అని అన్నారు. “ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమే. రాజకీయాలు గురించి మాట్లాడేటప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవచ్చు. దాని వల్ల వచ్చిన సమస్యేమీ లేదు. ఒక ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని తగ్గించేలా పత్రికలు కథనాలు రాయటంపైన ప్రజలు ఆలోచన చేయాలని, అటువంటి మీడియాకు తగిన బుద్ధి చెప్పాలి“ అని అయోధ్య రామిరెడ్డి సూచించారు.