(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. దాదాపు 1500 కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ముందుకు వస్తున్నాయి.
ముందుగా తమిళనాడు ప్రభుత్వం తరపున సీఎం పళని స్వామి పది కోట్లు, తరువాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున సీఎం మమత బెనర్జీ రెండు కోట్లు విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు.
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, సినీ, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ముందుకు వచ్చారు. పలువురు పెద్దలు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. సినీ హీరోలు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ కోటిన్నర రూపాయలు చొప్పున, మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు కోటి రూపాయలు, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ 50లక్షలు, హీరో రామ్ 25లక్షలు, విజయ్ దేవరకొండ పది లక్షలు, హారిక హాసిని బ్యానర్తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి పది లక్షలు రూపాయలు విరాళంగా ప్రకటించారు. అదే విధంగా డైరెక్టర్ అనిల్ రావివూడి, హరీశ్ శంకర్, బండ్ల గణేష్ లు అయిదు లక్షల వంతున విరాళాలు ప్రకటించారు. ఇలా అనేక మంది తమ వంతు సహాయాన్ని తెలంగాణ సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.