‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది..’ అనే పాత సామెత ఎవర్ గ్రీన్. ఇప్పుడీ సామెత టీడీపీకి, చంద్రబాబుకి, లోకేశ్ కి తగులుకుంటోంది. ఇటివలి అమెరికా అధ్యక్ష ఎన్నికలే ఈ సామెత చెప్పుకోవడానికి కారణం. ‘ఎంకి’ అమెరికాలో ఎన్నికల ఫలితాలు అయితే.. ‘సుబ్బి’ తెలుగుదేశం, చంద్రబాబు, లోకేశ్ అన్నమాట. ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చంద్రబాబును, లోకేశ్ ను ఆడుకుంటున్న తీరు పై సామెతను నిజం చేస్తోంది. కారణం ఏంటో చదవండి..
చంద్రబాబు, లోకేశ్ పై విజయసాయిరెడ్డి పంచ్ లు..
రెండు మూడు రోజులుగా అమెరికాలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఈ టెన్షన్ వాతావరణాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్ర పరిస్థితులకు అన్వయించేశారు. ‘బ్రేకింగ్ న్యూస్: చంద్రబాబుకు పోటాపోటీగా ట్రంప్, బైడెన్ ఫోన్లు. తమ ఎన్నికల కమిషన్ ను, సుప్రీంకోర్టును ఎ మేనేజ్ చేయాలనే అంశంపై సంప్రదింపులు’ అని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు, వైసీపీ అభిమానుల పెదాలపై నవ్వులు.. అంతకు మించి సెటైర్లు. చంద్రబాబు గతంలో పక్క రాష్ట్రం అంశాలపై అక్కడి సీఎంతో మాట్లాడాను.. నోట్ల రద్దు చేయమని ప్రధానికి నేనే చెప్పాను అనే అంశాలను.. ఇటివలి రాష్ట్రంలోని ఎన్నికల కమిషన్ వ్యవహారం, కోర్టు తీర్పుల నేపథ్యంలో చంద్రబాబుపై వస్తున్న ఆరోపణలపై కూడా విజయసాయిరెడ్డి ఈ సెటైర్లు వేసి కామెడీ చేసేశారు.
చినబాబుపై మినీ పంచ్ లు..
చినబాబు లోకేశ్ కామెడీ చేయబోయి ఇరుక్కుంటూ ఉంటారు. ఆమధ్య లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. టీడీపీ అభిమానులు, వారి ‘సొంత’ వారు లోకేశ్ ను రిసీవ్ చేసుకున్నారు. న్యూజెర్సీలో ఎన్నారై టీడీపీ సమావేశం జరిగింది. అంతే.. ఆ ఆనందంలో ‘మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనిపిస్తోంది’ అంటూ ఓ డైలాగ్ వేశారు. దీనిని గుర్తుపెట్టుకున్న వైసీపీ ఎంపీ ‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 538 సీట్లకు 503 టీడీపీకి, డెమోక్రాట్లకు 20, రిపబ్లికన్లకు 15 సీట్లు వచ్చే అవకాశం.. లగడపాటి సర్వే’ అంటూ సర్వే కింగ్ లగడపాటినీ ఓ ఆట ఆడుకుంటూ ట్వీట్ చేశారు. అప్పటి పేపర్ కటింగ్ ను కూడా పోస్ట్ చేశారు. టీడీపీ నేతల అత్యుత్సాహాన్ని వైసీపీ నేతలు ఇప్పుడిలా వాడుకుని టీడీపీని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.