అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ నోటిదురుసుతనం కారణంగా జగన్ ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులు వస్తున్నాయని వైసిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.వైసీపీ పార్టీకి పంటికింద రాయిలాగ మారిన నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వానికి రోజుకో సవాల్ విసురుతున్నారు.
తాజాగా ఆయన మూడు రాజధానులకు ప్రజామోదం ఉందని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లయితే దాన్ని ప్రధానాంశంగా పెట్టుకుని రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అమరావతి అంశంపై గనుక రెఫరెండం నిర్వహించినట్లయితే తాను వైసీపీ నుండి వైదొలుగుతానని రఘురామకృష్ణంరాజు చెప్పారు .యధా ప్రకారం సీఎం జగన్ దీనిపై ఏ విధంగానూ స్పందించలేదు. అయితే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం రఘురామకృష్ణంరాజు సవాల్ ను స్వీకరిస్తున్న ధోరణిలో మాట్లాడారని సమాచారం.
ఆయన ఇటీవల మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ ‘మేము విశాఖపట్నంలో రాజధానిని పెట్టాలనుకుంటున్నాం… ప్రతిపక్షాలు అమరావతిలో ఉంచాలంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణ అంటే రెఫరెండమే ఉత్తమం..ఇందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ‘అని స్పీకర్ వ్యాఖ్యానించటం జరిగింది .ఎన్నికలంటే భయపడాల్సిన అవసరమేమీ లేదు.. మూడు రాజధానులకు అమరావతినుంచి విశాఖకు రాజధాని తరలింపునకు రాష్ట్ర ప్రజలు సుముఖంగా ఉన్నారని కూడా స్పీకర్ పేర్కొనడం వైసిపి వర్గాలకు మింగుడు పడడం లేదంట. అమరావతి ప్రధానాంశంగా ఒకవేళ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలనుకొంటే అది జగన్ స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయమని,అందులో స్పీకర్ ఎందుకు వేలు పెట్టడమని వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇంతకు ముందే స్పీకర్ సీతారామ్ న్యాయ వ్యవస్థపైనా కోర్టుల పైన కూడా దుందుడుకు విమర్శలు చేసి కేసులో కూడా ఇరుక్కున్నారు.కోర్టులు న్యాయమూర్తులు రాష్ట్రాన్ని పాలించ దలుచుకుంటే ఇక ముఖ్యమంత్రి ,ప్రభుత్వాలు ఎందుకని స్పీకర్ ధ్వజమెత్తడం తెలిసిందే.కోర్టు హాలు నుండి ఈ రాష్ట్రాన్ని వారు పాలించదలుచు కున్నారా అని కూడా న్యాయమూర్తులను స్పీకర్ నిలదీశారు. ఈ తరహా లో స్పీకర్తో సహా పలువురు వైసీపీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కోర్టులపై చేసిన వ్యాఖ్యలపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం తెలిసిందే.ఏదేమైనా తమ్మినేని కారణంగా వైసిపి ప్రభుత్వం అప్పుడప్పుడు ఇరకాటంలో పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.