తమ చేతుల్లో ఉన్న వ్యవస్థలతో రాష్ట్రాలను, సీఎంలను ముప్పతిప్పలు పెట్టడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. తమ పార్టీ కాని ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రాల్లో ఉన్నారో అక్కడ తమ గవర్నర్ల ద్వారా తమకు అనుకూలంగా చేస్తూ బీజేపీ రాజకీయం నడిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందా.. గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను బీజేపీ చేయించిందా.. లేక ఆమెనే చేసారా.. దీని వెనుక రాజకీయం దాగుందా.. ఆమె వేదనే దాగుందా అనేది తెలియాల్సి ఉంది.
గవర్నర్ ఏమన్నారంటే..
“కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. వైరస్ వ్యాప్తిని ప్రభుత్వం అంచనా వేయలేకపోతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రతపై ప్రభుత్వాన్ని హెచ్చరించి సూచనలు చేసి కొన్ని లేఖలు రాసాం. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కరోనా పరీక్షలు పెంచాలని కోరాం. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. కరోనాను కట్టడి చేయాల్సిన ప్రాంతాలపై కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. కరోనా చికిత్స తెలంగాణకు భారమైంది. అందుకే ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు” అని గవర్నర్ అన్నారు.
గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ – బీజేపీ విమర్శ.. ప్రతివిమర్శలు..
గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మండిపడింది. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందిస్తూ.. ‘కోవిడ్ పై ప్రభుత్వం శక్తికి మించి పని చేస్తోంది. ప్రభుత్వంపై గవర్నర్ వ్యాఖ్యలు అర్ధరహితం. ఆమె గవర్నర్ లా కాకుండా బీజేపీ అధ్యక్షురాలి తరహాలో మాట్లాడుతున్నారు’ అన్నారు. సైదిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గవర్నర్ ఒక డాక్టర్ గా పరిస్థితులు అంచనా వేసి మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆమె వంద శాతం నిజం చెప్పారు. బీజేపీ ఆమె వెనుక ఉండి ఉంటే ఈసరికి తెలంగాణలో రాష్ట్రపతి పాలన వచ్చి ఉండేది. గవర్నర్ పై ఎమ్మెల్యే వ్యాఖ్యలు వ్యక్తిగతమా.. ప్రభుత్వం చేయించిందా అని పార్టీ ప్రముఖులు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ కూడా గవర్నర్ వ్యాఖ్యల్ని సమర్ధించింది. కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
దక్షిణాదిన బలపడాలనేది బీజేపీ ఆకాంక్ష. దేశంలో ఎక్కడా గవర్నర్లు దగ్గాలన్నా.. తుమ్మాలన్నా బీజేపీ అనుమతి తీసుకోవాల్సిన అవసరముంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా బీజేపీ ప్రమేయం ఉందనే టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ఈ అంశంపై తాడోపేడో తేల్చుకోవాలని టీఆర్ఎస్ ఆలోచిస్తోందని వార్తలు వస్తున్నాయి.