గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.వానలు వరదలు కారణంగా చూపి ముఖ్యమంత్రి కేసీఆరే ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ ఎన్నికలను వాయిదా వేయించవచ్చునని ఆ వర్గాలు అంటున్నాయి.అయితే ఇందుకు కారణం ప్రజలపై ప్రేమతో కానేకాదు.వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ ఈ ఎన్నికలను వెనక్కు జరపాలని అనుకోవడం లేదు.హైద్రాబాద్ వరదలు టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసేశాయి.గత ఎన్నికల్లో తొంభై తొమ్మిది డివిజన్లను టీఆర్ఎస్ గెలుచుకోగా ఈసారి ఎన్నికల్లో వంద పైమాటేనని తరచూ కెసిఆర్ తనయుడు పట్టణాభివృద్ధి శాఖ కెటిఆర్ చెబుతుంటారు.
అసలు తమకు కార్పోరేషన్లో పోటి కూడా లేదని కేటీఆర్ అనేవారు మీడియా సమావేశాల్లో ఇదే ధీమా ఆయన వ్యక్తం చేసేవారు.నగరంలో విస్తృతంగా పర్యటిస్తూ ఇదంతా టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అని కూడా ఆయన ప్రజలకు చెప్పేవారు.కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హైద్రాబాద్ మహానగరం దాదాపు జల సమాధి అయిపోయిన పరిస్థితులు తలెత్తడంతో టీఆర్ఎస్ వారికి సౌండ్ పడిపోయింది.వరదల కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం చూసేసరికి అధికార పార్టీ నగరాన్ని ఎంత అభివృద్ధి చేసిందో జనాలకు కళ్ళకు కట్టినట్టు కనబడింది.దీంతో తిరుగుబాటు మొదలైంది పరామర్శించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేతలను ప్రజలు తరిమి తరిమి కొట్టే వరకు పరిస్థితి వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,కార్పోరేటర్లు ఆఖరికి మంత్రులు కనిపించినా ప్రజలు మీద పడుతున్నారు.నాలాలు పూడికలు, రోడ్ల వెడల్పు, చిన్నా చితకా చెరువులను పరిరక్షించడం, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ ఇలా పలు విషయాల్లో ప్రభుత్వం విఫలమైందని జనం వారిని కడిగేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్ గెలవడం అసంభవమని ఆ పార్టీ అగ్రనేతలే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మొత్తుకున్నారట.ప్రజల కోపం తగ్గేవరకూ ఆగి ఈలోపు కొన్ని అభివృద్ధి పనులు చేసి ఆ తర్వాత ఎన్నికలు పెడితే మంచిదని వారు అధి నాయకుడి దగ్గర చెప్పుకున్నారు. కెటిఆర్ కూడా ఇదే అభిప్రాయాలను తండ్రి దగ్గర వ్యక్తం చేశారని సమాచారం.దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఎన్నికలను వాయిదా వేయడానికి గల మార్గాలను అన్వేషిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.