హైదరాబాద్: ఇటీవలి ముందస్తు శాసనసభ ఎన్నికలలో చూపించిన జోరును టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికలలో చూపించలేకపోతున్నది. మొత్తం 17స్థానాలకు గాను 8 సీట్లలోనే టిఆర్ఎస్ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. నాలుగు స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్ధులు, మరో నాలుగు సీట్లలో బిజెపి అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్ స్థానంలో ఒక దశలో కాస్త వెనుకబడిన మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ మళ్లీ పుంజుకున్నారు.
నిజామాబాద్ స్థానంలో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపి కవిత వెనుకబడిఉన్నారు. ఆమెపై బిజెపి అభ్యర్ధి అరవింద్ ఆధిక్యత కనబరుస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్ సీట్లలో కూడా బిజెపి అభ్యర్ధులు ముందుకు వెళుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్ధిపై ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్గిరి సీటులో ముందంజలో ఉన్నారు. నాగర్కర్నూల్, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాలలో టిఆర్ఎస్ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు.