తుపాను వేళ కెరటం పైకి లేచినట్టు.. బంకులోని పెట్రోలు భగ్గుమని మండినట్టు.. రాజమౌళి సినిమాలో ఆయుధం వాడినట్టు.. దుబ్బాకలో రాజకీయం ఇప్పుడు మొదలయింది..!! ఇన్నాళ్లు చప్పగా.., సైలెంట్ గా సాగుతున్న రాజకీయం ఇప్పుడు రాష్ట్రం దృష్టిని తిప్పేసింది. గెలుపుపై కొంచెం నమ్మకంతో ఉన్న బీజేపీని… గెలుపు సులువే అనుకుంటున్న టీఆరెఎస్ గట్టిగా గోకింది. బీజేపీకి రక్తం వచ్చింది. ఇంకా ఆ బీజేపీ మాత్రం ఎందుకు ఊరుకుంటుంది..! కేసీఆర్ మాయలు మాత్రమే చేయగలరు, మాటలు మాత్రమే చెప్పగలరు.., కానీ బీజేపీ మంత్రాల్ని, మాటల్ని, మాటల్ని “మేనేజ్” చేయగలదు. ఇన్నాళ్లు ఎందుకో పెద్దగా పట్టించుకోని బీజేపీని ఈ గోకుడుతో ఇక ఆట మొదలెట్టినట్టే..! కాసుకో కేసీఆర్..!!
అప్పట్లో రేవంత్ పై అదే అస్త్రం.., ఇప్పుడు రఘుపై మళ్ళీ..!!
టీఆరెస్ రాజకీయం మరీ సిల్లీగా మారిపోయింది. ఎక్కడైనా ఓడిపోయే భయం ఉంటే చాలు అక్కడ దొంగాపోలీస్ ఆట మొదలు పెడుతుంది. అంటే దొంగా వాళ్ళే, పోలీస్ కూడా వాళ్ళే..! దొంగలా వెళ్లి ఇంట్లో డబ్బు పెట్టేసి.., పోలీసులు వెళ్లి తనిఖీలు చేసి.., పెట్టిన దొంగను కాకుండా.., ఆ ఇంటి ఓనర్ ని దొంగగా మారుస్తారన్నమాట. అదే టీఆరెస్ ఆడే దొంగాపోలీస్ ఆట. 2018 శాసనసభ ఎన్నికల సందర్భంగా వారి ప్రధాన లక్ష్యంగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఇదే తరహా అస్త్రాన్ని ప్రయోగించింది.., సఫలమైంది. రేవంత్ దొరికారు. టీఆరెస్ ప్లాన్ వర్కౌట్ అయింది. వారి పంపకాలు సులువుగా చేసుకున్నారు. గెలుపు దక్కింది. ఎన్నికల్లో రేవంత్ ఓడినా.., నైతికంగా టీఆరెస్ అక్కడ ఓడింది..! ఇప్పుడు దుబ్బాకలో బీజేపీ రఘుపై ఇదే తరహా ప్లాన్ వేసింది. కాకపోతే బెడిసి కొట్టింది. బీజేపీ స్ట్రాంగ్ గా ఉండడం.., రఘు టీమ్ చురుగ్గా ఉండడంతో పోలీసులను రెడ్ హ్యాండెడ్గా పెట్టేసుకున్నారు. ఇహ ఇప్పుడు బీజేపీకి టైం వచ్చింది.
సింపతీ టన్నులు టన్నుల్లో..!!
బీజేపీ అభ్యర్థి రఘుపై దుబ్బాకలో సింపతీ ఉంది. పాపం రెండు సార్లు ఓడిపోయారు అనే మాట ఉంది. అందుకే ఈసారి ఆయనకు కొంతమేరకు సానుకూలత కనిపిస్తుంది. ఏకపక్షంగా టీఆరెస్ కొట్టేయాల్సిన సీటుని రఘు తనవైపు తిప్పుకుంటున్నారు. ఇలా ప్రచారాలు, సవాళ్లు, తిట్లు, చిన్నపాటి పంపకాలతో ఉన్న దుబ్బాక రాజకీయం గంట కిందట నుండి బాగా వేడెక్కింది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు మామ ఇంట్లో పోలీసులే డబ్బు పెట్టేసి.., ఆ డబ్బు అక్రమంగా దొరికినట్టు సృష్టించి.. రఘుపైకి నింద నెట్టాలనుకున్న ప్లాన్ బెడిసి కొట్టింది. పోలీసులు బుక్కయ్యారు. ఇది రఘుకి, బీజేపీకి బాగా ఆకలిసొచ్చింది. దుబ్బాకని లైట్ తీసుకున్న తెలంగాణ బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి ఊపు తెచ్చింది. ఇదే మాంచి టైం.. కేసీఆర్ కి చెమటలు పట్టించేద్దాం.., రఘుని అసెంబ్లీకి పంపించేద్దాం అనుకుంటున్న బీజేపీ నేతలకు ఈ అవకాశం దొరికినట్టే. దీన్ని అనుకూలతగా మలుచుకుని గెలుపు వ్యూహాల్లో బీజేపీ మునిగింది. ఇప్పటికీ అక్కడ బీజేపీ టీఆరెస్ (పోలీసులు) యుద్ధం గట్టిగానే జరుగుతుంది.
(దుబ్బాక గ్రౌండ్ రిపోర్ట్. ఎవరి ఎన్నికల వ్యూహం ఏమిటి..? అవకాశాలు ఎలా ఉన్నాయి..? అనే నిశిత అంశాలతో దుబ్బాక గ్రౌండ్ రిపోర్ట్ ప్రత్యేకంగా “న్యూస్ ఆర్బిట్” లో రేపు సాయంత్రం..!!)