తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడచిన 24గంటలలోనే కొత్తగా 1831 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో జిహెచ్ఎంసీ పరిధిలో 1419 ఉన్నాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 25,733కి చేరింది. ఇప్పటి వరకు 14,781 మంది చికిత్స అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా 10,644 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనాతో 11మంది మృతి చెందగా ఇప్పటి వరకు 306 మరణాలు సంభవించాయి.
కరోనా తొలి నాళ్ళలో విస్తృతంగా సమీక్షలు జరిపిన ముఖ్య మంత్రి కెసిఆర్ ఇటీవల మీడియా ముందుకు కూడా రావడం లేదు. మరో పక్క పలు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఫీజుల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా కరోనా పేషెంట్స్ ను జలగల్లా పీడించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర బృందం వచ్చి చెప్పి వెళ్లిన తరువాతే ఎక్కువగా కరోనా టెస్ట్ లు చేస్తున్నారని, అంతకు ముందు నామ మాత్రంగా పరీక్షలు జరిపారని కూడా విమర్శలు వచ్చాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా పేషెంట్స్ చికిత్స కు మూడు లక్షలకు పైగా వాసులు చేసున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్ లు ట్విట్టర్ వేదికగా సమస్యను గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ దృష్టికి తీసుకుని వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే గవర్నర్ తమిళిసై వెంటనే స్పందించారు. ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల లో కరోనా వైద్య సేవలపై సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లులు, టెస్ట్ లు, అందుబాటులో ఉన్న బెడ్లు తదితర విషయాలపై సమీక్ష చేస్తానని ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్ లు ఫిదా అయ్యారు.