అమరావతి: అమరావతిలో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూములకు విలువ పడిపోతుందన్న భయంతో టిడిపి కుట్ర రాజకీయాలు చేస్తోందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తుంటే, ఒక్క ప్రాంతానికే అభివృద్ధి పరిమితం చేయాలని టిడిపి ప్రయత్నిస్తుందని అన్నారు. రాష్ట్రాన్ని రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులోకి నెట్టిన ఘనుడు చంద్రబాబు అని వైవి విమర్శించారు. టిడిపి వారి భూముల కోసం లక్షల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయాలా అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రైతు సంక్షేమానికి సిఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. రాజధాని ప్రాంత రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, కశ్చితంగా న్యాయం జరుగుతుందనీ తెలిపారు. కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం ఉంటుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమలలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తామని వైవి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.