టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైవీ సుబ్బారెడ్డికి ఏదీ కలసిరావడం లేదు. క్రిస్టియానిటీ, ఆయనే క్రిస్టియన్ అని, తిరుమల టికెట్ల వెనుక జెరూసలెం యాత్ర ప్రచారం, కొన్ని రేషన్ కార్డులపై ఏసుక్రీస్తు బొమ్మ, తిరుపతి సప్తగిరుల్లో చర్చీ ఆకారం.. ఇలా అనేక వివాదాలు ఆయన్ను చుట్టుముట్టాయి. వీటన్నటింటికీ సమాధానాలిస్తూ, సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కరోనా సమయంలో దర్శనాల విషయంలో ఆయన సరైన నిర్ణయం తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాలనాపరమైన నిర్ణయం తీసుకోలేక కరోనా కేసులు పెరగడానికి కారణమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
టీటీడీలో ఇంత దారుణమైన పరిస్థితా..!
కరోనాతో టీటీడీలో నిన్న ముగ్గురు చనిపోవడం కలకలం రేపుతోంది. గతంలోనే మాజీ ప్రధానార్చకుడు కూడా మృతి చెందారని అంటున్నారు. ఇప్పటికే 748 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకింది. వీరిలో 405 మంది కోలుకుంటే ఇంకా 338 మంది వైరస్ తో పోరాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో దర్శనాలకు ఎందుకు అనుమతిస్తున్నారు అనేది ప్రశ్న. కరోనాతో వ్యవస్థలన్నీ వెనక్కు వెళ్లిపోయాయి. రోజురోజుకీ తీవ్రమవుతున్న వైరస్. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత తగ్గే వరకూ దర్శనాలు నిలిపేస్తే టీటీడీకి గానీ, భక్తులకు కానీ వచ్చే నష్టం లేదు. భక్తులకు కరోనా సోకితే టీటీడీ ఆ విమర్శలను ఎదుర్కోగలదా?
ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ అవుతున్న సమయంలో దర్శనాలకు అనుమతివ్వడం ఎందుకు? టీటీడీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందా? ఇన్ని ప్రశ్నలు, సమస్యల నడుమ విమర్శలు ఎదుర్కోవడం ఎందుకు? చైర్మన్ గా పాలకమండలిని సుబ్బారెడ్డి కంట్రోల్ చేయలేకపోతున్నారా.. ఈవోతో సత్సంబంధాలు లేవా.. అర్చకుల సలహాలు తీసుకోవటం లేదా అనే కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరోవైపు రమణ దీక్షితులు ఇప్పటికే దర్శనాలు నిలిపేయాలని ట్వీట్స్ కూడా చేశారు. ఈవో మాత్రం అర్చకుల నుంచి వినతులు రాలేదంటున్నారు. ఒకొక్కరు ఒక్కో వాదన వినిపిస్తున్నారు. మరి.. పరిస్థితి తీవ్రం కాకముందే టీటీడీ మేల్కొంటే ఉత్తమమనే వాదనలు వినిపిస్తున్నాయి.