తిరుమల శ్రీనివాసునికి ఎన్నడూ లేనంతగా కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా శ్రీనివాసుడు అందరిపై చల్లని చూపులు చూపిస్తూ వచ్చాడు. పాపం ఇప్పుడు మాత్రం ఆయనకు ఒక వర్గమే సేవ చేయాలట. ఓ కులమే అంకితం కావాలట. తాజాగా ఓప్రాంతీయులే అక్కడ పని చేయాలట. టీటీడీ తాజాగా తీసుకువచ్చిన నోటిఫికేషన్ బాగోతం ఇది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిటిడి చుట్టూ అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొన్ని విప్పుకోలేక, కొన్ని చిక్కులు ఎక్కువై ఆ చిక్కు ముళ్లు అన్నీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివాదరహితుడిగా పేరు ఉన్నప్పటికీ, టిటిడి వివాదాల్లో మాత్రం వేలు, తల అన్నీ పెట్టేస్తున్నారు. సాధారణంగా రాజకీయ అంశాన్ని అయినా, పాలనా అంశాన్ని అయినా వైవీ సుబ్బారెడ్డి చాకచక్యం గా మాట్లాడుతూ ఉంటారు. కానీ టీటీడీకి వెళ్లిన తర్వాత మాత్రం ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాక ఆయన మాటల్లో కూడా తడబాటు కనిపిస్తోంది. అదే తడబాటు నిర్ణయాల్లో కూడా వస్తుంది. తాజాగా టీటీడీ తీసుకున్న ఓ నిర్ణయం రాష్ట్రంలో చాలా మంది ముక్కున వేలు వేసుకునేలా చేసింది. ఉద్యోగాలు అంతే కడప జిల్లాకేనా, సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంతానికే ఉద్యోగాలా? టీటీడీ ఉద్యోగం చేయాలంటే కడప జిల్లాలోనే పుట్టలా? అనే సరి కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది.
75శాతం కడపకు రిజర్వేషన్ అంట..!
విషయంలోకి వెళితే టీటీడీలో గార్డెనర్ (తోటమాలి) పోస్టులు భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ పడింది. 47 పోస్టులు ఉన్నాయి. 13,000 వేల నుండి 40,000 వేల జీత భత్యాలు బాగానే ఉన్నాయి. విద్యార్హత 5వ తరగతి, 7వ తరగతి అని పెట్టినప్పటికీ ఇప్పుడు ఉన్న పోటీతత్వం దృష్యా డిగ్రీ వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోన వసరం లేదు. ఇటువంటి పరిస్థితిలో టీటీడీలో ఉద్యోగాలు అంటే రాష్ట్రం అంతటి నుండి దరఖాస్తు చేసుకోవడం సహజమే. కానీ ఈ తాజా నోటిఫికేషన్ లో మొత్తం 47 పోస్టులలోనూ 75శాతం పోస్ట్ లు కడప జిల్లాకే రిజర్వేషన్ చేశారు. ఇది ఏ ప్రాతిపదికననో, ఏ లెక్కనో, ఎలా ఆలోచించి చేశారో టిడిపి బోర్డుకి, ప్రభుత్వానికే తెలియాలి. మిగిలిన 25 శాతం పోస్టులు రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాలకు కేటాయించారు. సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న జిల్లా అంటే చిత్తూరు జిల్లాకు కొంత రిజర్వేషన్ కేటాయించారంటే పెద్దగా ఆశ్చర్యం ఉండదు. కానీ దూరంలో ఉన్న కడప జిల్లాకు ఈ రిజర్వేషన్ అమలు చేయడం, కనీసం సగం కూడా కాకుండా 75శాతం వారికే కేటాయించడం కొత్త అనుమానాలకు, కొత్త విమర్శలకు, సరి కొత్త వివాదానికి తావిస్తోంది. ప్రతి వివాదానికి ఏదో ఒక సమాధానం చెప్పుకునే టీటీడీ ఈ వివాదానికి కూడా సమాధానం ఆల్ రెడీ సిద్ధం చేసుకునే ఉంటుంది. కానీ ఆ నోటిఫికేషన్ చూస్తే కనిపించే తప్పులకు, అర్థం అయ్యే వాదానికి ఎన్ని భిన్న వాదనలు చేసినా పస ఉండదు.