టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. టీటీడీ నిర్ణయాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. తాజాగా ఆ లిస్టులో టీటీడీ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితుడు, ఎంపీ రాకేష్ సిన్హా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీటీడీ మాజీ ఈవో, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు, బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్సింహారావు చేరారు.
టీటీడీ ఆస్తులను కాపాడటం సమస్య కాదు
టీటీడీ ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు రాకేష్ సిన్హా డిమాండ్ చేశారు. ఈ మేరకు టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆయన లేఖ రాశారు. ఇది భక్తుల మనోభావాలకు ముడిపడిన అంశమనీ, ఆస్తుల వేలం నిర్ణయంపై పున:సమీక్ష చేయాలనీ ఆయన టీటీడీని కోరారు. తిరుమల శ్రీవారి ఆస్తులను కాపాడుకోవడం పెద్ద సమస్య కాదనీ, అవసరమైతే ఇందులో భక్తులను కూడా భాగస్వాములను చేయవచ్చని ఆయన సూచించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనని చెప్పి.. ఇప్పుడు ఆస్తులను అమ్మడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీవారికి భక్తులకు సమర్పించిన ఆస్తుల వెనుక ఉండే మనోభావాలను గౌరవించాలని రాకేష్ సిన్హా లేఖలో పేర్కొన్నారు.
దాతలను అవమానించడమే..!
మరో పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ నిర్ణయాన్ని తప్పు పడుతూ ప్రకటన విడుదల చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ.. భక్తులు తిరుమల వెంకన్నకు ఆస్తులు సమర్పించుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. భక్తితో ఇచ్చిన ఆస్తికి నిరర్థకం అనే ప్రశ్నే ఉండకూడదని చెప్పారు. నిరర్థకం అనడం అంటే దాతలను అవమానించడమేనని అయన పేర్కొన్నారు. దాతలు ఇచ్చిన ఆస్తులను టీటీడీ దార్మిక కార్యక్రమాలకు, ధర్మ ప్రచారాలకు వినియోగించు కోవాలే కానీ అయినకాడికి అమ్మేస్తాం అనడం అంటే దేవుడి ఆస్తులను ఉప్పు గల్లుకి ఎవరికో కట్టబెట్టే కుట్రకు రంగం సిద్ధం చేస్తున్నట్లే అనిపిస్తోందని అన్నారు. తిరుమల శ్రీవారి ఆస్తులు అమ్మడం మొదలుపెట్టాక వరుసగా రాష్ట్రంలోని ఇతర దేవాలయాల ఆస్తులను అంగట్లో పెట్టేస్తారా అని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
నేతలు, వ్యాపార వేత్తలకు పునరావాస కేంద్రం
టీటీడీ రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలకు పునరావాస కేంద్రంగా మారిపోయిందని ఐవై ఆర్ కృష్ణారావు విమర్శించారు. దేశమంతా స్థిరాస్తి రంగం కోలుకోలేని పరిస్థితితో ఉంటే ఆస్తులను విక్రయానికి పెడతారా? అని ఆయన మండిపడ్డారు. సదావర్తి భూముల అమ్మకంపై అప్పట్లో వైసీపీ హడావిడి చేసిందనీ, మరి మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దాతలు ఇచ్చేటప్పుడు తీసుకుని ఇప్పుడు అమ్మేస్తామంటే సరైన పద్ధతేనా అని ఆయన ప్రశ్నించారు. టీటీడీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలనీ, భక్తిభావం ఉన్నవారిని సభ్యులుగా చేర్చాలనీ ఆయన డిమాండ్ చేశారు. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని ఐవైఆర్ సూచించారు. ఇక ఈ సమస్యపై గళం విప్పిన పవన్ కల్యాణ్కు ఐవైఆర్ ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ నిరసన బాట
టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. టీటీడీ భూముల వేలం నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు డిమాండ్ చేశారు. భవిష్యత్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన సూచించారు. స్వామివారికి భక్తులు సమర్పించిన భూములను అమ్మాలను కోవడం..భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉందన్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల ఉపవాస దీక్షలు చేపడతామని జీవిఎల్ తెలిపారు.
తిరుమల శ్రీవారి స్థిరాస్తులను వేలం వేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఉన్న 28 ఆస్తులు విక్రయించేందుకు ఇప్పటికే రెండు స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేసింది. ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించింది. దీనిపై మే 28న జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.