YS Jagan కి ఆ ఐఏఎస్ వైఎస్ కి కుడి భుజం.. అయితే జగన్ కి బలం.. అని చెప్పాల్సిందేనా? అంటే గతంలోని పరిస్థితులు.. ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానమే చెప్తున్నాయి. ఆ ఐఏఎస్ పేరు ప్రవీణ్ ప్రకాశ్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రవీణ్ ప్రకాశ్ పని విధానం, ఆయన వ్యవహార శైలి ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంది. అలాగని నెగటివ్ గా కాదు. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరు ఆయనకు ఉంది. తన కింది అధికారులు, సిబ్బందితో ఎలా పని చేయించాలి, ప్రభుత్వంలోని పెద్దలను సమయస్ఫూర్తితో ఎలా ఒప్పించాలి.. ‘ఔను’ అనిపించేలా ‘నో’ ఎలా చెప్పించాలో ఆయనకు తెలుసు. అందుకే ప్రవీణ్ ప్రకాశ్ అంటే ఎవరికీ లొంగని ఉన్నతాధికారిగా పేరు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న అధికారిపై పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఒక చిన్న మచ్చ పడుతోంది.
ఎస్ఈసీ లేఖపై ప్రవీణ్ ప్రకాశ్ వివరణ..
ప్రస్తుత పంచాయతీ ఎన్నికలు అధికారికంగా ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషన్ గా.. అనధికారికంగా సీఎం వైఎస్ జగన్, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గా మారిపోయింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులు ఎవరూ ఇబ్బంది పడలేదు కానీ.. ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి. ఇందులో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన ఆదేశాలను పాటించని వారిపై, ఎదురొస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ను పంచాయతీ ఎన్నికల విధుల నుంచి బదిలీ చేయాలని సీఎస్ ఆదిత్యనాధ్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. ఈ లేఖ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై వెంటనే ప్రవీణ్ ప్రకాశ్ కూడా సీఎస్ కు లేఖ రాశారు. ‘కలెక్టర్లు ఎస్పీలతో భేటీ జరగకుండా చూశానన్న ఆరోపణలు అసంబధ్దం. హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల అంశాన్నే ప్రభుత్వానికి నివేదించాను. గతంలో ఎన్నికల వేళ విశాఖ, రంగారెడ్డిలో నన్ను బదిలీ చేసిన మాట నిజమే. 2014, 2017లో పరిశీలకుడిగా ఈసీ తనను నియమించింది. నేనెప్పుడూ నిబంధనల పరిధి దాటలేదు’ అని రాశారు.
మరి.. ఆరోజు అలా ఎందుకు చేశారో?
ఈ లేఖలో తాను పరిధి దాటి పనిచేయలేదని.. సీఎస్ కింద పని చేసే ప్రభుత్వ ఉన్నతోద్యోగుల్లో తానూ ఒకరినని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని పరిశీలిస్తే.. ఏపీ గత సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎల్వీ సుబ్రమణ్యం స్థానంలో సీఎస్ గా నీలం సాహ్ని వచ్చారు. ఆమేరకు ఎల్వీ బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది ప్రవీణ్ ప్రకాశ్.. ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం పొలిటికల్ అని ఉంది. నిజానికి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అధికారం ప్రవీణ్ ప్రకాశ్ కు లేదు. కానీ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు సీఎస్ లేఖపై ఆయన ప్రతిస్పందనగా రాసిన లేఖలో తాను సీఎస్ కింది అధికారిని అని రాసినప్పుడు.. అప్పుడెలా ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసారు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. 2006, 2008లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన విశాఖ, రంగారెడ్డి ఉప ఎన్నికల్లో ప్రవీణ్ ప్రకాశ్ అప్పట్లో ఆ జిల్లాల్లో కలెక్టర్ గా ఉన్నారు. ఇదే ఆరోపణలలో అప్పట్లో బదిలీ అయ్యారు.. తన లేఖలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు కూడా. అయినా.. 2014, 2017లో ఈసీ ప్రవీణ్ ప్రకాశ్ నే ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది కూడా.
ప్రవీణ్ ప్రకాశ్ నిబద్ధతకు ఉదాహరణలు..
నిజానికి ప్రవీణ్ ప్రకాశ్ కు నిబద్ధత ఉన్న అధికారిగా ఎంత పేరు ఉందో.. అప్పటి సీఎం వైస్ కు అత్యంత నమ్మకస్థుడైన అధికారిగా కూడా పేరు ఉంది. ఇప్పుడు వైఎస్ జగన్ కు కూడా అంతే నమ్మకస్థుడిగా పేరు ఉంది. ఈ కారణాలు, ప్రస్తుతం జరిగిన పరిణామాలు ఎస్ఈసీ ఆయన బదిలీకి సిఫారసు చేయడానికి కారణమైంది. విజయవాడ మున్సిపల్ కమిషనర్ హోదాలో బందర్ రోడ్, ఏలూరు రోడ్ విస్తరణకు వచ్చిన రాజకీయ అడ్డంకులు దాటి ఆయన విధులు నిర్వహించారు. విశాఖ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలకు ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు మన్యం ప్రాంతాల్లో నీళ్లలో కూడా నడుచుకుంటూ వెళ్లి విధులు చేపట్టారు. విధి నిర్వహణలో ఇంతటి పేరున్న ప్రవీణ్ ప్రకాశ్ పై ప్రస్తుతం బదిలీ వివాదం ఓ మచ్చ అనే చెప్పాలి.