జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం.. జగన్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలవడం, సీజేఐకి కూడా లేఖలు వెళ్లడం తెలిసిన విషయమే. మరోవైపు జగన్ కూడా తాను ఏ ఉద్దేశంతో ఈ లేఖ రాశారో.. దానిని నెరవేర్చుకునే ఏర్పాట్లలో ఉన్నారు. ఈక్రమంలో విచారణ జరగాల్ని మొదటి రోజే ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది.
విచారణ నుంచి జస్టిస్ లలిత్ ఎందుకు తప్పుకున్నట్టు..?
ఇంతకీ ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ లలిత్ ఎందుకు తప్పుకున్నారనేది సందేహంగా మారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ, జస్టిస్ నారీమన్, జస్టిస్ లలిత్ వరుస స్థానాల్లో ఉన్నారు. జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందుకే వెళ్లాయి. అయితే.. అనూహ్యంగా ఈ కేసు విచారణ నుంచి లలిత్ తప్పుకున్నారు. పిటిషన్లో పేర్కొన్న ప్రతివాది (సీఎం జగన్) తరపున గతంలో సీబీఐ కోర్టుల్లో న్యాయవాదిగా జస్టిస్ లలిత్ వాదించినట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ కేసును వేరు ధర్మాసనానికి సూచించినట్టు తెలుస్తంది. అయితే తెర వెనుక ఇంకొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. తనకు సీనియర్ అయిన రమణ కేసు కావడం, ఒక రాష్ట్ర సీఎం.. తన సహచరుడు రమణకు వ్యతిరేకంగా లేఖ రాయడం.. దీని వెనక న్యాయవ్యవస్థ, రాజకీయ పెద్దలు ఉండటమే లలిత్ తప్పుకోవడానికి కారణాలు అని తెలుస్తోంది. జస్టిస్ లలిత్ బీజేపీకి అనుకూలంగా (బీజేపీలో నెంబర్ టూకు గతంలో రెండు కేసుల్లో వాదించి క్లీన్ చిట్ ఇప్పించ్చారు) ఉన్న నేపథ్యం కూడా కారణం కావొచ్చని అంటున్నారు. దీంతో సున్నితమైన ఈ కేసు విచారణకు రాజకీయ సంబంధం లేనివారైతేనే బాగుంటుందని ఆయన భావించి ఉండొచ్చని భావిస్తున్నారు.
తదుపరి అడుగేంటి.. ఇంకా ట్విస్టులు ఉన్నాయా..?
ఈ కేసుపై జాతీయ మీడియా, జాతీయ నాయకులు, ఢిల్లీ స్థాయిలోని న్యాయవ్యవస్థ పెద్దలు కూడా దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో.. మరెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయోనని కూడా ఎదురు చూస్తున్నారు. విచారణకు స్వీకరిస్తే.. మీకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. మీ వాదన ఏంటి.. ప్రమాణ పత్రం దాఖలు చేయండి అని జగన్ కు నోటీసులు ఇస్తారు. దీనికి జగన్ ఇచ్చే సమాధానం.. దాఖలైన పిటిషన్లు ఆధారంగా న్యాయ నిపుణులకు ఒక అవగాహన వస్తుంది. జగన్ ఇచ్చే సమాధానాలే ఇక్కడ కీలకం కానున్నాయి. అయితే.. విచారణ మొదటి దశలోనే జస్టిస్ లలిత్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. తదుపరి ఈ కేసును ఎవరు విచారణకు స్వీకరిస్తారు.. జగన్ ఇచ్చే సమాధానాలేంటి.. అనే అంశాలు కీలకంగా మారాయి. దీంతో ఈ కేసులో మరెన్ని ట్విస్టులు ఉంటాయోననే ఆసక్తి నెలకొంది.