ఆయన పార్టీ మారతారట – పుకారు (మే 10 నుండి 20 మధ్య)
అవును ఎమ్మెల్యే గారు పార్టీ మారిపోతున్నారు – ప్రచారం (మే 20 నుండి 24 మధ్య)
ఈనెల 27 న చేరుతున్నారట – అనధికార వాస్తవం (మే 25 , 26 న )
ఉదయమే మంత్రిని కలిశారట… ఆయనతో పాటూ అనగాని సత్యప్రసాద్ కూడా వైసిపి కి జంపట – విపరీత వార్త (అన్ని చానెళ్లు, మీడియాల్లో బ్రేకింగ్ వార్తలు) – (మే 27 న )
సీఎం తో ఫైనల్ గా మాట్లాడాలట, ఇప్పటికి తాత్కాలికంగా బ్రేకులు పడింది – మే 28 న …
30 న చేరుతారట… అన్ని ఖరారయ్యాయి. నేరుగా సీఎం జగన్ ని కలిసి చేరడమే…!! చివరిగా ఈరోజు ఆ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించి “నేను టిడిపిలోనే ఉంటున్నాను. పార్టీని వీడడం లేదు. అవన్నీ పుకార్లు, కావాలని బురద చల్లుతున్నారు” ఈరోజు ప్రకటన… ఇప్పటికీ ఇవన్నీ ఎవరి గురించి అనేది ప్రకాశం జిల్లా “పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు” విషయంలో జరిగిన ప్రచారం, వార్తలు, వాస్తవాలు ఇవి. ఇంతకు ఆయన పార్టీ మార్పుకి నిజంగానే ప్రయత్నించారా…? ఎందుకు ఆగింది..? ఆయన టిడిపిలోనే కొనసాగుతారా..? అనేది మూలాల్లోకి వెళ్లి చూసి వద్దాం..!!
జరిగిందేమిటి… కొన్ని అనధికార వాస్తవాలు..!
“నిప్పు లేనిదే పొగ రాదు”..! అంటే ఏలూరులో ఆ ఆలోచన లేనిదే పార్టీ మార్పు పుకార్లు ఇంత విపరీతంగా వ్యాపించవు. నిజానికి ఈ నెల మొదటి వారంలో కొన్ని కీలక పరిణామాలు జరిగాయని ఆ నియోజకవర్గ నాయకుల ద్వారా వెల్లడవుతుంది. పర్చూరు నియోజకవర్గంలో కొందరు వైసిపి నాయకులతో మంత్రి బాలినేని ఓ సందర్భంలో “మీ ఎమ్మెల్యే మన పార్టీలోకి వస్తారట, వారి మనుషుల్ని ఇబ్బంది పెట్టొద్దు” అని చెప్పారని ఒక టాక్ మొదలయ్యింది. దీన్ని నిజం చేకూర్చేలా ఎమ్మెల్యే కూడా కొందరు వైసిపి నాయకులకు ఫోన్ చేసి “మీతో మాట్లాడాలి, కలుద్దాం” అంటూ కబురు పెట్టారట.. ఈ రెండు బాగా వ్యాపించాయి. హైదరాబాద్ లో కూడా కొన్ని కీలక చర్చలు జరిగాయని, ఈనెల 10 – 15 మధ్య బాలినేని, ఎమ్మెల్యే కలిసి చర్చించారని ప్రచారం జరిగింది. దీంతో ఇక మారడం ఖాయంగా అనుకున్నారు.
మిశ్రమ స్పందన రాక…!
ఈనెల 15 తర్వాత ఎమ్మెల్యే కొంత ఆలోచన మొదలు పెట్టారు. తన సన్నిహితులు ఒక్కొక్కరితో చర్చించడం ఆరంభించారు. నియోజకవర్గానికి ఒక టీమ్ ని పంపించి మార్పు పర్యవసానాలపై అధ్యయనం చేయించారని చెప్పుకుంటున్నారు. ఇలా తీవ్రంగా కసరత్తు చేసి, తెర వెనుక కీలక అడుగులు నడిపించారు. ఆ నియోజకవర్గంలో ఏలూరి మంచి క్యాడర్ ఉంది. పార్టీ మార్పు విషయంలో పెద్దగా అంగీకారం రాలేదు. కానీ… మరోవైపు వైసిపి నాయకులూ మాత్రం ఈయన రాకపై ఆసక్తి చూపించారు. ఇవన్నీ బేరీజు వేసుకున్న ఏలూరి చివరిగా తన తరపున షరతులను పార్టీ దూతల ద్వారా ఆ వైసిపి పెద్దలకు పంపించారట. దీంతో ఇక చేరడం ఖాయమనే పుకారు వ్యాపించింది. 26 , 27 తేదీల్లో సచివాలయంలో కూడా అక్కడక్కడ ఈ చర్చ జరిగింది. అందుకే 27 న చేరిపోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ…!!
ఎక్కడ ఆగిందంటే…!
ఎమ్మెల్యే సాంబశివరావు తెరవెనుక ప్రయత్నాలు చేయడం వాస్తవం. ఆయనకు ఉన్న ఒత్తిళ్లు, ఆర్ధిక అవసరాలు, రాజకీయ భవిష్యత్తు అవసరాల కోణంలో ఆలోచనలో పడ్డారు. చివరి స్టెప్ లో భాగంగా మంత్రి బాలినేని … సీఎం జగన్ అనుమతి కోసం పార్టీ పెద్దలతో విషయం చెప్పారు. సామాజికవర్గం.., జిల్లాలో ఇతర అవసరాలు, సీఎం జగన్ కూడా ఆసక్తి చూపలేదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ… పర్చూరులో వారికి సరైన నాయకుడు లేక వైసీపీ పెద్దలే తమ ఎమ్మెల్యే ని ఒత్తిడి పెట్టి పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసారని… విఫలమయ్యారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. . ఇదే సందర్భంలో ఎమ్మెల్యే ఏలూరి కూడా మిశ్రమ స్పందన రావడం.., టిడిపి పెద్దల నుండి రాయబారాలు నడిచాయి.. అంటూ మరో వాదన వినిపిస్తుంది. అటూ, ఇటూ రెండు ఫలితాలు భిన్నంగా ఉండడంతో ఇక ఆగిపోవడం మంచిదని ఏలూరి భావించి ఉండొచ్చు. ఇలా చివరి దశలో పార్టీ మార్పు ఆగింది. దీంతో సదరు ఎమ్మెల్యే ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి “నాకు ఆ ఆలోచన లేదు. బురద చల్లుతున్నారు. నేను ఎవరితోనూ చేర్చించలేదు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక చివరిగా ఏలూరి పై ఈ పుకార్లు రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. టీడీపీ ఓడిన తర్వాత రాష్ట్రంలో దాదాపు పార్టీలో చాల మంది సైలెంట్ అయ్యారు. కానీ ఏలూరి మాత్రం మొదట్లోనే వైసీపీపై దూకుడుగా వెళ్లారు. ఈ ఏడాదిలోనే రెండు సార్లు తన నియోజకవర్గంలో చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహించారు. జనాలను భారీగా రప్పించారు. అంత ఘనంగా చేసిన ఆయన గడిచిన కొద్ది నెలలుగా సైలెంట్ గా ఉండడం.. పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించకపోవడం…, జగన్ పై, వైసీపీ పై విమర్శలు తగ్గించడంతో … ఇలా రకరకాల పుకార్లు, ప్రచారాలు వచ్చాయి.