రాజధాని వికేంద్రీకరణ, టీటీడీ డిక్లరేషన్, హిందూ దేవాలయాలపై దాడి, మంత్ర నాని వివాదాస్పద వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వీటితోనే సతమతమవుతున్న సీఎం జగన్ కు సొంత పార్టీ నేతల్లో విబేధాలు మరింత చికాకు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ అగ్ర నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డికి మంత్రుల శైలిపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇవన్నీ సీఎం జగన్ వద్దకు కొన్ని చేరుతున్నాయి.. మరికొన్ని వెళ్లడం లేదు. ఇలా ఉండగా ఓ జిల్లాలోని ఎమ్మెల్యే అదే జిల్లాకు చెందిన మంత్రులకు ‘పద్ధతి మార్చుకోండి..’ అంటూ బహిరంగంగా హెచ్చరించడం కలకలం రేపుతోంది.
రైతులపై కేసులు పెట్టడంపై ఎమ్మెల్యే గుర్రు..
వైసీపీలో వర్గాలు పెరిగిపోతున్నాయి. ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేనిపై ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులు, అధికారుల బదిలీలను మంత్రి ఇష్టానుసారంగా చేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరిన ఓ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోవడంలో అలిగి నియోజకవర్గానికే పరిమితం అయ్యారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తన నియోజకర్గంలోని రైతులపై కేసులు పెట్టడంపై జిల్లా మంత్రులపై ఆగ్రహంగా ఉన్నారు. ‘పండిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా..’ అని ప్రశ్నిస్తున్నారు.
ఆ జిల్లాలో ఎదురు తిరుగుతున్న ఎమ్మెల్యేలు..
ఐదు నెలల క్రితం మీడియా ముందే మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డిపై విమర్శలు చేశారు నెల్లూరు జిల్లా సీనియర్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి. పార్టీ తీరును కూడా తప్పుబట్టారు. రీసెంట్ గా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కూడా మంత్రులపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రులూ.. ఇది మంచి పద్దతి కాదు.. రైతులపై పెట్టిన కేసులు వెంటనే వెనక్కు తీసుకోమని పోలీసులకు చెప్పండి. దమ్ముంటే మిల్లర్లు, దళారులపై కేసులు పెట్టండి’ అంటూ సూటిగానే చెప్పారు. గతంలో ఆనం, ఇప్పుడు ప్రసన్నకుమార్ పార్టీ తీరును విమర్శించడం జిల్లాల్లో ఎమ్మెల్యేల అసంతృప్తికి నిదర్శనం. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మంచి పట్టు ఉన్న జగన్ కు స్థానిక మంత్రుల తీరు తలనొప్పి తెచ్చిపెడుతోందని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?