ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆదివారం నాడు యాభై ఆరు బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లను ప్రకటించనున్నప్పటికీ ఆయా వర్గాల్లో ఏ మాత్రం సంతోషం కానరావడం లేదు నిజానికి కార్పొరేషన్ చైర్మన్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.
కార్పొరేషన్ చైర్మన్లకు కేబినెట్ హోదా కూడా ఉంటుంది. కానీ బిసి కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లకు ఈ సదుపాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మెలికపెట్టిందట.అందువల్లే పదవులు వస్తాయని భావిస్తున్న వారు కూడా పెదవి విరుస్తున్నారని సమాచారం.ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న బీసీ కార్పొరేషన్లను సొసైటీలు, స్వచ్ఛంద సంస్థలుగా ప్రభుత్వం రిజిస్టర్ చేసింది. పేరుకు కార్పొరేషన్లు కానీ ప్రభుత్వం నుంచి వీటికి ఎలాంటి సహాయసహకారాలు ఉండవన్నట్లు తెలుస్తోంది.అంటే ఇవి ఉత్తుత్తి కార్పొరేషన్ లేనని ప్రచారం జరుగుతోంది.
ఇంకా చెప్పాలంటే వీటిని కార్పొరేషన్లుగా చూపిస్తారు తప్ప ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖకు బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని వీటి ద్వారా ఖర్చు పెడతారు.వీటిక౦టూ ప్రత్యేకంగా నిధులేమీ ఉండవని చెబుతున్నారు .ఇలా స్వచ్ఛంద సంస్థలు, సొసైటీలుగా రిజిస్టర్ చేస్తే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా డిమాండ్ చేసే ఆస్కారం ఉండదు. అంతేగాక వీటిని ప్రభుత్వం సొసైటీలు, స్వచ్ఛంద సంస్థల పేరిట రిజిస్టర్ చేయించడంతో చైర్మన్కు గానీ,డైరెక్టర్లు గానీ ఎలాంటి జీతభత్యాలు ఉండవు. దీంతో బీసీ నేతలంతా అసంతృప్తిలో ఉన్నారు.ఇవి లెటర్ హెడ్ పదవులు తప్ప ఏ విధంగానూ తమకు లబ్ధి చేకూర్చలేవని వారంటున్నారు.అటు అధికారాలు లేక ఇటు నిధులు లేక జీతభత్యాలు లేక ఈ పదవులను ఏమి చేసుకోవాలని వారు వాపోతున్నారు.
అయితే సుమారు ఐదు వందల నుండి ఎనిమిది వందల మంది వరకు బీసీలకు ఈ కార్పొరేషన్ల ద్వారా పదవులిచ్చి ఆయా వర్గాలను ఆకట్టుకోవాలన్నది జగన్ ప్రభుత్వం వ్యూహం.తెలుగుదేశం పార్టీకి ఆదినుండి అండగా ఉంటున్న బిసిలను పూర్తిగా వైసీపీ వైపు తిప్పుకోవడానికి ఈ కార్పొరేషన్ల ఏర్పాటు జరుగుతోందన్నది నిర్వివాదాంశం.కానీ ఉత్సవ విగ్రహాల వంటి ఈ పదవులను తీసుకోవడానికి బీసీ నేత లేమీ ఎగబడుతున్నట్లు కనిపించడం లేదు.అయితే జగన్ ని ధిక్కరించే సాహసం ఎవరూ చేయలేరు కాబట్టి ఇప్పట్లో బీసీ నేతల్లో ఆ అసంతృప్తి లోలోపలే ఉంటుంది.