ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపి నుండి ఎవరికి ఛాన్స్ దక్కనుందనే ఊహాగానాలు మొదలు అయ్యాయి. కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించే నేతలను బట్టి కేంద్ర బీజేపీ స్టాండ్ ఏమిటో వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. కుల, ప్రాంత సమీకరలు చూసుకుంటే ముందువరుసలో టీడీపీ నుండి గెలిచి బీజేపీలోకి విలీనమైన వై ఎస్ చౌదరి (సుజనా చౌదరి), సీఎం రమేష్ ఉన్నారని, పార్టీ విధేయత,పార్టీలో సీనియారిటీ చూసుకుంటే రామ్ మాధవ్ లేక జేవీఎల్ నర్సింహారావులు ఉన్నట్లు తెలుస్తోంది.
సుజనా చౌదరి, సీఎం రమేష్ లు బీజేపీలో చేరినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలమనే పేరు ఉంది. చంద్రబాబే వారిని బీజేపీలోకి పంపారని గతంలో వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. మొదటి నుండి వీరు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేక భావనతోనే ఉన్నారు. సుజనా చౌదరి టీడీపీ ఎంపిగా ఉన్నప్పుడే మోడీ మొదటి మొదటి వర్గంలో పని చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు ఆర్ధికంగా బలవంతులు. సామజిక పరంగా (కమ్మ, బీసీ) ఓటు బ్యాంకు ప్లస్ పాయింట్ అనుకుంటున్నారు.
ఇక రేస్ లో ఉన్న బీజేపీ నేతలు ఇద్దరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ఒకరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. ప్రధాని మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాలకు సన్నిహితుడు అనే పేరు ఉంది. జగన్ పాలనపై రాష్ట్ర బీజేపీ నేతలు ఒక పక్క విమర్శలు చేస్తుండగా రాం మాధవ్ మాత్రం జగన్ ఏడాది పాలన భేష్ అంటూ కితాబు కూడా ఇచ్చారు. తరువాత రాజ్యసభ సభ్యుడు జేవీఎల్ నర్సింహారావు. రాబోయే రోజుల్లో వైకాపాతో దోస్తాన్ అవసరం అని భావిస్తే వీరిలో ఒకరికి ఛాన్స్ లభించవచ్చని అంటున్నారు. జీవీఎల్ కూ వైకాపాతో విరోధం లేదు. మొదటి నుండి జగన్ ప్రభుత్వంపై సానుకూల వైఖరితోనే ఉన్నారు జీవీఎల్. ఈ నలుగురిలో ఎవరికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ లభించనుందో?, కేంద్రంలోని బీజేపీ ఈక్వేషన్స్ ఏమిటో? చూద్దాం తరువాత.