ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తలపండిన నేతగా రాణిస్తున్న బొత్స సత్యనారాయణ మొదటి లో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా రాణించి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా మారారు. ప్రస్తుతం మంత్రిగా మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర కన్వీనర్ గా రాణిస్తున్నారు. గతంలో కోలగట్ల వీరభద్రస్వామి మరియు బొత్స సత్యనారాయణ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్టుగా ఉండేది. ఇద్దరిదీ ఒకే జిల్లా పైగా చిన్ననాటినుండి ఫ్రెండ్స్, రాజకీయాల్లోకి వచ్చేసరికి దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు కు వీర విధేయ శిష్యులు. బొత్స… కోలగట్ల వీరభద్రస్వామి ఎప్పుడు పేరు పెట్టి పిలవకుండా చంటి అని పిలిచే చనువు అప్పట్లో.
అంతటి స్నేహం పెనవేసుకున్న… గతంలో రాజకీయాల్లో ఇద్దరు ఒకో మెట్టు ఎదిగేకొద్దీ రెండు వర్గాలుగా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక రాజకీయ నేతగా బొత్స సత్యనారాయణ ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పీసీసీ చీఫ్ గా ప్రయాణం సాగించి ప్రస్తుతం వైసీపీ లో మంత్రి పదవి లో ఉన్నారు. కోలగట్ల వీరభద్ర స్వామి మాత్రం ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. గతంలో బొత్స- కోలగట్ల వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెంత వైరం ఉండేది. జిల్లా కేంద్ర కార్యాలయాల్లో వేరువేరు పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికి వారు నువ్వానేనా అన్నట్టుగా రాజకీయవేడి జిల్లాలో రగిలించే వారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జిల్లాలో వైసీపీ తీర్థం తీసుకున్న కోలగట్ల వీరభద్రస్వామి తర్వాత ఎమ్మెల్సీగా రాణించారు. 2014 ఎన్నికల తర్వాత బొత్స సత్యనారాయణ వైసీపీ లోకి వస్తున్న తరుణంలో ఆయన రాకను కోలగట్ల వర్గం తీవ్రంగా వ్యతిరేకించిందట. వీరభద్ర స్వామి కూడా బొత్స రాకుండా అడ్డుకోవడానికి చివరిదాకా అనేక ప్రయత్నాలు అప్పట్లో చేసినట్లు టాక్. అటువంటి ఉప్పు నిప్పుగా ఉండే ఈ నాయకులు ప్రస్తుతం చెట్టాపట్టాలేసుకుని జిల్లాల్లో పర్యటనలు చేయడం అందరికీ షాక్ కి గురి చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఏటువంటి చిన్న విషయమైనా గాని కలిసి, ఏం చేద్దామని చర్చించుకుని ఒకే నిర్ణయం పైకి వచ్చి అమలు చేస్తున్నారట. అదే విధంగా జిల్లాలో జరిగే సమీక్ష సమావేశాలకు ఇద్దరు హాజరయ్యే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారట. పాత గొడవలన్నీ మర్చిపోయి ఇద్దరు నేతలు కలసి రాజకీయాలు చేయటంతో బొత్స- కోలగట్ల ఉమ్మడి రాజకీయం విజయనగరం జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా మారినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. కాగా వీరిద్దరు కలసి రాజకీయం చేయడానికి చాలా వరకు అధిష్టానం సూచనలే కారణమని వైసిపి పార్టీ లో టాక్ నడుస్తోంది.