గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి నడి సంద్రంలో నావలా తయారైందా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ టికెట్ మీద గెలవాలి అని ఒత్తిడి వస్తోంది. తానూ సిద్దమే అని ప్రకటిచండం కూడా జరిగింది. అయితే.. వైసీపీలోని ఒక వర్గం వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వంశీ వైసీపీ నుంచి పోటీ చేస్తే ఏకంగా రెబల్ గా పోటీ చేయడానికి సిద్ధమవడం ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ నుంచి కూడా పెద్దగా మద్దతు రావడం లేదనే వార్తలు వస్తున్నాయి.
వైసీపీలో జిల్లా స్థాయిలో పరవాలేదు.. కానీ..
టీడీపీ నుంచి గెలిచిన వంశీ తర్వాత వైసీపీకి మద్దతివ్వడంతో గన్నవరంలో మిశ్రమ స్పందన లభించింది. ఆయన అభిమానగణం వెన్నంటి నిలిచినా తటస్థుల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. వైసీపీలోని కొన్ని సామాజిక వర్గాలు ఆయనకు దూరంగా ఉన్నాయి. గన్నవరంలో కాపు, కమ్మ, యాదవ సామాజికవర్గాల ఓట్లు కీలకం. యాదవులు 60శాతంకు పైగా టీడీపీ వైపే ఉంటారు. దీంతో టీడీపీ అక్కడ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్ కు వంశీ మద్దతివ్వడంపై ఆ సామాజికవర్గాలు అంగీకరించలేక పోతున్నాయి. వైసీపీలో కొడాలి నాని వర్గం తప్పించి మిగిలిన పెద్దల నుంచి పెద్దగా మద్దతు రావడం లేదని తెలుస్తోంది. యాదవులు ఈ పరిస్థితులన్నింటినీ అంచనా వేస్తున్నారు.
కాపు, యాదవులను కాదని జగన్ నిర్ణయం తీసుకుంటారా..
ఉప ఎన్నిక వస్తే ఎమ్మెల్యే సీటు తమకే ఇవ్వాలని కాపులు కోరుతున్నారని తెలుస్తోంది. ఇందుకు పేర్ని నానితో కలిసి జగన్ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు గట్టు రామచంద్రరావు కూడా వంశీకి వ్యతిరేకంగా తన అల్లుడు భరత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారని తెలుస్తోంది. యాదవులు మాత్రం పరిస్థితులను అంచనా వేస్తున్నారట. వైసీపీ నుంచి గెలిచి టీడీపీని ఆడుకోవాలని చూసిన వంశీకి ప్రస్తుతం ఈ తలనొప్పులను ఎదుర్కోవాల్సి వస్తోంది.