Vangaveeti Radha: ‘తన హత్యకు రెక్కీ జరిగింది’ అని వంగవీటి రాధా ఇటివల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంఘటన తెలిసిందే. వెనువెంటనే రాజకీయ పరిణామాలు వేగంగా జరిగిపోయిన విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ ఆయనతో భేటీ అయ్యారు. సీఎం జగన్ కూడా వేగంగా స్పందించి ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గన్ మెన్లను కేటాయించారు. అయితే.. రాధా ప్రస్తుతం టీడీపీలో ఉండటంతో ఆ పార్టీ కూడా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించింది. అయితే.. తనకు కేటాయించిన గన్ మెన్లను తిరస్కరించడంతో రాజకీయం మరో కీలక మలుపు తీసుకుంది.
చంద్రబాబు హామీ ఇచ్చినట్టేనా..
దీంతో రాధా మళ్లీ పార్టీ మారే ఉద్దేశంలో లేరని స్పష్టత రావడంతో టీడీపీ నాయకులు ఆయన్ను ఓదార్చారు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి మరీ రాధాను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ప్రకటన కూడా చేశారు. అయితే.. (Vangaveeti Radha) రాధాకు పార్టీ మారే ఉద్దేశం లేదనీ.. టీడీపీలోనే కొనసాగుతారని సమాచారం. కాకపోతే.. తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఉందని.. అందివచ్చిన అవకాశాన్ని రాధా చక్కగా ఉపయోగించుకుని.. స్వయంగా చంద్రబాబుతో ఈమేర హామీ ఇప్పించుకున్నారని తెలుస్తోంది. కాపు సామాజికవర్గంలో.. అందులో విజయవాడలో రాధాకు బలం, బలగం ఎక్కువే. రాధా సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు రాధా ప్రతిపాదనకు చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
రాధా ఈసారి అక్కడి నుంచేనా..
నిజానికి.. (Vangaveeti Radha) వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. తాను కోరుకున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటును వైసీపీ తిరస్కరించిందనే కారణంతోనే ఆయన టీడీపీలో చేరారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. టీడీపీలో కూడా ఆయనకు ఆ సీటు దక్కలేదు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని సూచించింది. అందుకు తిరస్కరించిన ఆయన ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారానికే పరిమితమయ్యారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచే విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలనే రాధా అభిమతం నెరవేరినట్టేనా.. చూడాలి.