Vijaya Sai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఏపి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎంపీలు పలు మార్లు స్పీకర్ కు పిటిషన్ లు అందజేసినా ఇంత వరకూ చర్యలు చేపట్టని విషయం తెలిసిందే. రఘురామపై పిటిషన్ అందజేసి దాదాపు 13 నెలలు దాటినా ఇటీవల కాలంలోనే స్పీకర్ ఓంబిర్లా ఆయనకు నోటీసు జారీ చేశారు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, సీఎం జగన్ నిర్ణయాలను తప్పుబడుతూ బహిరంగంగా రఘురామ కృష్ణంరాజు ఇష్టానుసారం విమర్శలు, ఆరోపణలు చేస్తునే ఉన్నారు. రఘురామపై చర్యలు తీసుకోకపోతే పార్లమెంట్ లో ఆందోళన చేస్తామని కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గతంలో పేర్కొన్నారు.
అయితే ఈ అంశంపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన చేయలేదు. కానీ స్పీకర్ ఓంబిర్లా రఘురామ పై అనర్హత వేటు వేయకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న వైసీపీ ఎంపీలు నిన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఫిరాయింపులకు పాల్పడే వారిపై గడువులోగా చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలని కోరుతూ వైసీపీ ఎంపిలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు వినతి పత్రం సమర్పించారు. ఇటువంటి చట్ట సవరణ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా చేస్తుందా అన్నదే ఇక్కడ సమస్య. బీజేపీ గూటికి చెందిన ఇద్దరు టీఎంపీ ఎంపీలపైనా అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. చట్ట సవరణ చేస్తే బీజేపీలో చేరిన టీఎంసీ ఎంపీలపైనా అనర్హత వేటు వేయాల్సి వస్తుంది. ఈ తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి సవరణలు చేయడానికి ముందుకు వస్తుందా అనేది ప్రశ్నార్ధకమే కదా.
ఇకపోతే ఏపి హైకోర్టును, జాతీయ న్యాయ యూనివర్శిటీని కర్నూలుకు తరలించాలని న్యాయశాఖ మంత్రికి ఇచ్చిన విజ్ఞాపనలో పేర్కొన్నారు. ఇంతకు ముందే హైకోర్టు తరలింపు అంశం తమపరిధిలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకాభిప్రాయంతో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పేసింది. మూడు రాజధానుల అంశానికి సంబంధించి పిటిషన్లు విచారణ జరుగుతున్న తరుణంలో హైకోర్టు తరలింపునకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారా అన్నది అనుమానాస్పదమే. ఈ రాజధాని పిటిషన్ పై ఏదో ఒక తీర్పు వెలువడిన తరువాత ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞాపన పంపితే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో పరిష్కరించుకునే సమస్యపై కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో విజయసాయి రెడ్డితో పాటు మోపిదేవి వెంకట రమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డిలు ఉన్నారు.