అమరావతి: రాష్ట్రంలో టిడిపి నేతలు నేటికీ వనరుల దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు.
‘టిడిపి నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినా సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలి స్తూనే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. సిఎస్ తక్షణం కొరడా జుళిపించాలి’ అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు 2015లో దావోస్లో జరిగిన ఆర్థిక సదస్సుకు వెళ్లి వచ్చిన తరువాత రాష్ట్రానికి రానున్నాయని చెప్పిన ఏ కంపెనీ కూడా ఇంత వరకూ రాలేదని విజయసాయిరెడ్డి విమర్శించారు.
‘దావోస్ ఆర్థిక సదస్సు- 2015 నుంచి తిరిగొచ్చాక బుల్లెట్ ట్రెయిన్ కోసం స్పెయిన్ను, డ్వాక్రా ఉత్పత్తులు మార్కెటింగ్కు వాల్ వార్ట్ను ఒప్పించాననీ, కొబ్బరి నీళ్లను పెప్సీ అమ్ముతుందని కోశాడు. విమానాల ప్లాంట్ పెట్టేందుకు ఎయిర్ బస్ వస్తోందని అన్నాడు. ఇందులో ఒక్కటన్నా నిజమైందా?’ అని ప్రశ్నిస్తూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యంపై చంద్రబాబు చేసిన విమర్శలను కూడా విజయసాయి రెడ్డి తప్పుబట్టారు. ‘చివరాఖరున చంద్రబాబు చేసిన మరో ఘోర తప్పిదం సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం గారిని ధూషించడం. ఓటమి దగ్గరపడిందన్న ఫ్రస్టేషన్లో ఆయనపై నోరు పారేసుకున్న ఫలితం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది సారుకు. తవ్వకుండానే బయట పడుతున్న ఆర్థిక అవకతవకలు రేపు గద్దె దిగిన తర్వాత బాబును వెంటాడతాయి’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.