రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి వైకాపాలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వైకాపా సోషల్ మీడియా యంత్రాంగానికి అండగా ఉండటంతో పాటు సూచనలు, సలహాలు అందిస్తుంటారని పేరు ఉంది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన ప్రభుత్వాన్ని ప్రశంసించడం కంటే ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఎక్కువగా పోస్ట్ లు పెట్టిన విషయం తెలిసిందే. విజయసాయి ట్విట్టర్ అకౌంట్ కు ఫాలోవర్స్ కూడా అధికంగానే ఉన్నారు. విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ఏ కామెంట్ చేసినా వాటిని వైకాపా ఫాలోవర్స్ నమ్ముతుంటారు.
ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికల్లో బలం లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్ల రామయ్య ను పోటీకి దింపడంపై విజయసాయి రెడ్డి 12వ తేదీన ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. ‘భోగాలు మీవి, త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలవా? రాజ్యసభ సీట్లు గ్యారంటీగా గెలుస్తారనుకున్నప్పుడు కనకమేడల లాంటి వారు అభ్యర్థులుగా ప్రత్యక్షమవుతారు. బలం లేక ఓటమిచెందే సమయంలో బడుగు వర్గాల అభ్యర్థులు బలిపశువులవుతారు. ఈ నెల19న మీ బలం ఎంతో, వెంట ఉండేది ఎవరో, వదిలి పోయేది ఎవరో తెలిసి పోతుంది’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయి ట్వీట్ తో 19వ తేదీ ఎన్నికలో ఎదో జరిగిపోతుందని, ఇప్పటికే వైకాపా దరికి చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు టీడీపీకి షాక్ ఇచ్చి వైకాపాకు అనుకూలంగా ఓటు వేస్తారని ఆయన ఫాలోవర్స్ భావించారు.
అయితే రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఓటు చెల్లుబాటు కాకుండా వేసిన సంగతి తెలిసిందే. టీడీపీలో ఇప్పటి వరకు మౌనంగా ఉంటూ వచ్చిన గంటా శ్రీనివాసరావు, గణబాబు లాంటి ఎమ్మెల్యేలు సైతం టీడీపీ అభ్యర్థికే ఓటు వేశారు. చెల్లుబాటు కాకుండా ఓటు వేసిన ఆదిరెడ్డి భవాని తన తప్పిదంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంజాయిషీ ఇచ్చుకున్నారు. విజయసాయి రెడ్డి ఊహించినట్లు ఏమి జరగక పోవడంతో సోషల్ మీడియాలో అయన ఫాలోవర్స్ ఏంది ఇలా చేశారు అని ప్రశ్నిస్తున్నారుట.