ఇటీవల వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి సందర్భంగా వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రచించిన ‘నాలో నాతో వైయస్సార్’ పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించడం అందరికీ తెలిసిందే. ఒక భర్తగా మరియు తండ్రిగా అదేవిధంగా రాజకీయ నాయకుడిగా చాలా దగ్గర నుండి వైయస్ విజయమ్మ రాజశేఖర్ రెడ్డి ని చూడటంతో ఈ పుస్తకానికి మంచి ఆదరణ బయట మార్కెట్ లో దక్కింది. మొదటిరోజు ఐదువేల ప్రింట్ కాపీలు అమ్ముడుపోయాయి. ఒక రాజకీయ నాయకుడి గురించి వచ్చిన పుస్తకానికి ఈ స్థాయిలో ఆదరణ దక్కించుకోవడం ఇదే ప్రథమమని పబ్లిషర్స్ అంటున్నారు. దీంతో మార్కెట్ లో ‘నాలో నాతో వైయస్సార్’ పుస్తకానికి మంచి డిమాండ్ పెరిగింది.
ఇటువంటి తరుణంలో విజయమ్మ రాసిన పుస్తకం పై ఇంటర్నెట్ లో కుట్ర జరిగినట్లు పిడిఎఫ్ రూపంలో తప్పుడు ఫైల్ తో ఒకటి ప్రచారంలోకి వచ్చినట్లు, అమెజాన్ లో ఉన్న పుస్తకానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిడిఎఫ్ ఫైల్ కి ఎటువంటి సంబంధం లేదని టీటీడీ బోర్డు అధ్యక్షుడు వై వి సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ‘నాలో..నాతో..వైఎస్సార్’’ పుస్తకం పేరుతో పీడీఎఫ్ ఫైల్ను సామాజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకానికి, దీనికి సంబంధం లేదని వై వి సుబ్బారెడ్డి తెలిపారు. ఎమెస్కో పబ్లిషర్స్ అచ్చువేసిన పుస్తకమే అసలైన పుస్తకమని పేర్కొన్నారు.‘ దురుద్దేశంతో ఈ పీడీఎఫ్ఫైల్ను సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశామని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ అభిమానులు ఈ అంశాన్ని గమనించాలని వై.వి సుబ్బారెడ్డి తెలిపారు.
అంతేకాకుండా లేనిపోని వార్తలు సృష్టించే విధంగా ఇంటర్నెట్ లో ‘నాలో నాతో వైయస్సార్ పుస్తకం’ నకిలీ పిడిఎఫ్ ఫైల్ వైరల్ అవుతుందని కొంతమంది చెప్పుకొస్తున్నారు. విజయమ్మ రాసిన విధానం పుస్తకంలో ఒకలాగా ఉంటే సోషల్ మీడియాలో మరో రూపం లో పిడిఎఫ్ ఫైల్ వైరల్ అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా వైసిపి మద్దతుదారులు నేరుగా అమెజాన్ ఇండియా సంస్థలో ఉన్న పుస్తకాన్ని కొనుక్కుని మాత్రమే చదవాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు.