అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము రహస్య పార్టనర్లు అని వారే బయటపెట్టుకున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ‘హుందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ప్రచారానికి చంద్రబాబు వెళ్లలేదట, పవన్ కూడా హుందాగానే మాలోకం నిలబడిన మంగళగిరి మొహం చూడలేదేమో’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ విధంగా తామిద్దరం పార్టనర్లమన్న సంగతి బయట పెట్టుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. చీకటి పొత్తుల విషయాన్ని ప్రజలు గ్రహించబట్టే గట్టి గుణపాఠం చెప్పారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
మోది రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన బాధ్యత లేని వ్యక్తి అనీ అనేక రకాలుగా చంద్రబాబు దూషించి ఇప్పుడు ఆయనతో వ్యక్తిగత విభేదాలేమీ లేవనీ సన్నాయినొక్కులు నొక్కుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. మోదిని గద్దె దింపడం కోసమే కాంగ్రెస్తో చేతులు కలిపినట్లు చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఎవరూ మర్చిపోరని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.