హైదరాబాద్: సినీ రంగానికి చెందిన వైసిపి ఎమ్మెల్యే రోజాకు వైఎస్ జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై ప్రముఖ నటి, కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్ విజయశాంతి స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. రోజాకు కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ నేత కెసిఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం మీదే దృష్టిసారిస్తున్నారనీ, ప్రధాన సమస్యలపై ఆయన దృష్టి సారించడం లేదనీ విజయశాంతి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు గడిచినా ఇంకా పరిష్కారం కానీ సమస్యలు అనేక ఉన్నాయన్నారు.
తెలంగాణలో మహిళా మంత్రులకు అవకాశం ఇవ్వకుండా కెసిఆర్ ఐదేళ్లు గడిపేశారని విజయశాంతి పేర్కొన్నారు. రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని విజయశాంతి అన్నారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూర్పుపై కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రులుగా అవకాశం ఇచ్చిన మహిళలతో పాటు సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజాకు కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకొని తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని విజయశాంతి అన్నారు. రాబోయే రోజుల్లోనైనా రోజా విషయంలో జగన్ సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని విజయశాంతి పేర్కొన్నారు.