తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక నాయకులు దుబ్బాక నియోజక వర్గంలో ఎవరికివారు తమ పార్టీల తరఫున ప్రజలకు హామీలు ఇస్తూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల విజయశాంతి పార్టీ మారుతున్నట్లు బీజేపీ లోకి వెళ్లి పోతున్నట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. పరిస్థితి ఇలా ఉండగా సోషల్ మీడియాలో దుబ్బాక ఎన్నికల విషయంలో టిఆర్ఎస్ పార్టీని అదేవిధంగా బీజేపీ ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టి చివర్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా విజయశాంతి పేర్కొనడంతో… ఆమె పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.
ఈ విషయం నడుస్తూ ఉండగానే కాంగ్రెస్ అదేవిధంగా బిజెపి పార్టీ లకు డిపాజిట్ కూడా రాదు అని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె ఆరోపించింది. దీన్ని బట్టి చూస్తే ముందే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లూ ఉందని ఆమె తెలిపింది. అంతేకాకుండా దుబ్బాక లో ఎలక్షన్ జరిగిన తర్వాత కెసిఆర్ ఫామ్ హౌస్లో ఈవీఎంల మిషన్లను పెట్టి లెక్కిస్తున్నారు ఏమో అని అనుమానం కలుగుతోందని విజయశాంతి సీరియస్ అయింది.
సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరణించడంతో జరగబోయే ఉప ఎన్నిక విషయంలో మంత్రి హరీష్ రావు ఎందుకంత కంగారు పడుతున్నరో ఎవరికీ అర్థం కావడం లేదని ఆమె అన్నారు. జరగబోయే ఉప ఎన్నికలలో జాతీయ పార్టీలకు ఎక్కువ ఓట్లు వస్తే హరీష్ రావు మంత్రి పదవి ఊడిపోతుందమో… కెసిఆర్ ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారమో అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోందని విజయశాంతి ఆరోపించింది. అంతేకాకుండా కరోనా వైరస్ విషయంలో మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల్లో కంటే దుబ్బాకలో ఓటర్లను ఆకర్షించేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారని విజయశాంతి ఆరోపించింది.