రాష్ట్రంలో రాజకీయానికి ప్రతిదీ కారణం అవుతోంది. ప్రతిదీ రాజకీయ వివాదం అవుతోంది. తెలుగుదేశం పార్టీ గానీ అటు వైసీపీ గానీ ఎవరికి వారు తమ వాదనలు వినిపించుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే అనేక వాదనలు, వివాదాల మధ్య విజయవాడలోని కనకదుర్గ ఫ్లైవర్ కూడా వివాదానికి కేంద్ర బిందువు గా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎంపి కేశినేని నాని ఒకలా స్పందిస్తుండగా దానికి భిన్నంగా ప్రభుత్వ మంత్రులు చెబుతున్నారు. నిజానికి ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన దుర్గగుడి ఫ్లైఒవర్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ప్రభుత్వం అయిదు రోజులు సంతాప దినాలుగా ప్రకటించినందున వాయిదా పడింది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సింది పోయి తెలుగుదేశం, వైసీపీ ఎవరికి వారు భిన్నంగా ప్రకటనలు ఇచ్చుకున్నారు. ఆ ప్రకటనల సారాంశం పరిశీలిస్తే ఈ క్రెడిట్ వంతెన వల్ల వచ్చే రాజకీయ లబ్దిని ఇరుపక్షాలు ఎవరికి వారే పంచుకోవాలని చూస్తున్నట్లు ఉంది. అయితే వంతెన నిర్మాణానికి ప్రధాన కారణమైన బిజెపి మాత్రం ఈ వ్యవహారంలో తలదూర్చకుండా సైలెంట్ గా వ్యవహరిస్తోంది. ఈ రోజు విభిన్నంగా విడుదలైన ప్రకటనలు పరిశీలిస్తే…
ఎంపి కేశినేని నాని ఏమన్నారంటే …
విజయవాడ కనకదుర్గ ఫ్లైఒవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 18వ తేదీన ప్రారంభిస్తారని కేశినేని నాని పేర్కొన్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ తేదీని ఎంపి కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఆర్ అండ్ బి మంత్రి శంకర నారాయణ ఎమన్నారంటే…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రోడ్ల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఏపిఆర్ డిసి) గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. రోడ్ల అభివృద్ధి చేయాలన్న దృక్పదంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు మూడు వేల కోట్లకు పైగా కార్పోరేషన్ ద్వారా అప్పు చేశారనీ విమర్శించారు. చేసిన అప్పు ను రోడ్ల అభివృద్ధికి ఉపయోగించకుండా ఎన్నికల్లో గెలవడం కోసం ఆ నిధులను దారి మళ్లించారని మంత్రి శంకర నారాయణ ఆరోపించారు. మూడు వేల కోట్ల అప్పుకు ఏడాదికి 250 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నామన్నారు. రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు సిఎం జగన్మోహనరెడ్డి మరిన్ని నిధులు కేటాయించారని చెప్పారు. చంద్రబాబు హయాంలో అయిదేళ్లుగా రాష్ట్రంలో రోడ్లు నిరాదరణకు గురి అయ్యాయని విమర్శించారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో పాటు 15 వేల కోట్ల పనులకు ఈ నెల 4వ తేదీన శంకుస్థాపన చేయాల్సి ఉండగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో వాయిదా పడిందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ వీడియో కాన్షరెన్స్ ద్వారా దుర్గమ్మ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఒవర్ ను జాతికి అంకితం చేస్తారని మంత్రి శంకర నారాయణ పేర్కొన్నారు. అదే విధంగా 1500 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.