స్వర్ణ ప్యాలెస్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ రగడకు దారి తీసింది. కులాల మధ్య ఆరోపణలకు తావిచ్చింది. ఈ అంశం తీవ్రం కాకముందే మరో అంశం రాజకీయ వైరానికి దారి తీస్తోంది. వైసీపీ, టీడీపీ, బీజేపీ పాత్ర ఉండటంతో ఇది ఎంత దూరం వెళ్తుందో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ విషయం ఏంటో.. వైరం ఏంటో.. అనే వివరాల్లోకి వెళ్తే..
వారధిపై వంతులాట..
విజయవాడకు అత్యంత ప్రతిష్టాత్మకంగా, నగరానికి నగలా నిలుస్తోంది ‘కనకదుర్గ ఫ్లై ఓవర్’. దశాబ్దాల నుంచీ నగరవాసులు ఎదురు చూస్తున్న ఈ వంతెన నిర్మాణం పూర్తైంది. ఈ గొప్పంతా మాదంటే మాదంటూ టీడీపీ, వైసీపీ.. తగువులాడుకుంటున్నాయి. ఐదేళ్లలో చంద్రబాబు చేయలేనిది.. 14 నెలల కాలంలో జగన్ చేసి చూపారంటూ వైసీపీ అంటోంది. టీడీపీ హయాంలో తొంభై శాతం పనులు పూర్తి చేస్తే.. మిగిలిన పది శాతం చేసిన వైసీపీకి ఇంత హడావిడి ఎందుకు.. అంటూ టీడీపీ వాదిస్తోంది. అయితే.. 2014లో ఈ వంతెనకు శంకుస్థాపన చేసింది మేమే అంటూ మధ్యలోకి బీజేపీ వస్తోంది. ఈ వ్యవహారం రాజకీయంగా ముదురుతున్న వేళ టీడీపీ వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది.
నితిన్ గడ్కరీకి ఆహ్వానం.. వినతి పత్రం..
అప్పట్లో కేంద్రమంత్రి హోదాలో గడ్కరీ ఈ వంతెన శంకుస్థాపన చేశారు. దీంతో ఆయనే కేంద్రమంత్రి హోదాలో వచ్చి వంతెన ప్రారంభించాలనేది టీడీపీ వాదన. ఈమేరకు విజయవాడ ఎంపీగా కేశినేని నాని నిన్న ఢిల్లీలో గడ్కరీని కలిసారు. ఎన్డీఏ హయాంలో నిర్మించిన ఈ వారధిని వైసీపీ తన ఖాతాలో వేసుకుంటోందనీ.. ఈ శ్రమకు ఫలితం దక్కాలంటే మీరే వచ్చి ప్రారంభించాలని గడ్కరీకి వినతి పత్రం అందించారు. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య వైరంలోకి బీజేపీని లాగినట్టైంది. కేంద్రమంత్రి హోదాలో గడ్కరీ ఇందుకు ఒప్పుకుంటే వైసీపీకి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఈ విషయంలో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.