అయోధ్య రామ మందిర విషయానికి ఏపీ రాజధాని అమరావతికి ఏమైనా సంబంధం ఉందా? ఆ సమస్య వేరు, ఈ సమస్య వేరు. కానీ రాజకీయ నాయకులు తలుచుకుంటే దేనికైనా ముడి పెట్టి మాట్లాడగలరు. అయితే టీడీపీ.. అమరావతి రాజధాని విషయంలో ఈ కోర్టు కాకపోతే మరో కోర్టు, ఆ కోర్టు కాకపోతే మరో బెంచ్ ఇలా లా పాయింట్ లు తీసి కేసును సుధీర్ఘకాలం కొనసాగించే పట్టుదలతో ఉన్నట్లు ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు విషయం లో పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. ఒక వైపు రాజధాని అమరావతి ప్రాంతంలోనే కొనసాగించాలని అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న ఆందోళనలు 250 రోజులు దాటున్నాయి. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడం జరిగింది. దీనిపై చకచకా మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలు ఆరంభించాలని అనుకుంటుండగా ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడంతో పరిపాలన రాజధాని విశాఖ తరలింపు ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లభించలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు పెద్ద రిలీఫ్ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు రాజధాని అంశం తమకు సంభందం లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం. రాజధాని అమరావతి కి సంబంధించి రైతులు, సంస్థలు, పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ లు 50కి పైగా హైకోర్టు విచారణలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ ఆధారంగా ఫైనల్ జడ్జిమెంట్ అనుకూలంగా తీర్పు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అధికార వైసీపీ కూడా అదే భవనతో ఉన్నది.
ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అమరావతి రాజధాని విషయంలో ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ను కేశినేని విమర్సిస్తూ అమరావతి నుండి రాజధాని తరలించడం సీఎం జగన్మోహన్ రెడ్డి వల్ల ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదని, ఈ విషయం అయనకూ తెలుసనీ అన్నారు. రాజకీయ లబ్ది కోసమే అయన డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు కేశినేని నాని. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి చంద్రబాబు పై నెపం వేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని కేశినేని అన్నారు. అయితే అయన కామెంట్స్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అయోధ్య రామ మందిరంలో మాదిరిగా అమరావతి విషయంలో కూడా న్యాయపరమైన వివాదం 25 నుండి 30సంవత్సరాల పాటు కొనసాగుతుంది అని కేశినేని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ‘కర్ర విరగదు, పాము చావదు’ అన్న సామెత మాదిరిగా న్యాయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తారను కోవచ్చు కదా!