విజయవాడ స్వర్ణ ప్యాలెస్ రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాద ఘటన ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.
దర్యాప్తు దశలో ఉన్న ఈ కేసుకు సంబంధించి విజయవాడ సిపి శ్రీనివాసులు సంచలన ప్రకటన చేశారు. కేసుకు సంబంధించి అనుమానితులు, ముద్దాయిలు విచారణకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఆసుపత్రి బోర్డు సభ్యులకు నోటీసులు ఇచ్చిన తరువాత ప్రశ్నిస్తున్నట్లు, ఈ విధంగానే రాయపాటి శైలజకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించినట్లు సిపి శ్రీనివాసులు స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే…తప్పించుకుని పారిపోయిన వాడు ఎక్కడున్నారో చెబితే లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని ప్రకటించారు. అదే రీతిలో ఆసుపత్రి విచారణకు సంబంధించి టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సోషల్ మీడియాలో చేసిన కామెంట్లపై స్పందించారు.
విచారణ అనేది పోలీసులకు ఎలా చేయాలో తెలుసు అంటూ…. పోలీసులకి రాజకీయ పార్టీలు మతాలు కులాలు ఉండవని స్పష్టం చేశారు. అంతేకాకుండా కేసుకు సంబంధించి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు స్పెషల్ టీంలను పంపమని, కేసుకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం సహకరించాలని తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.