Vijayawada TDP ; ఉద్యోగానికో.., వ్యాపారానికో.., డబ్బు సంపాదనకో అదృష్టం కలిసి రావాలేమో … కానీ రాజకీయానికి అదృష్టం కలిసి రాదు, వచ్చినా ఏమి చేయలేదు..! కానీ పార్టీలకు పోయే కాలం వస్తే మాత్రం ఎవరూ ఆపలేరు. దానికదే, స్వతహాగానే పోతుందని..! అచ్చం బెజవాడలో టీడీపీ లాగానే..!!
రాష్ట్రంలో ప్రస్తుతం 12 కార్పొరేషన్లకు.. 75 మున్సిపాలిటీలకు ఈ నెల 10 న ఎన్నికలు జరగనున్నాయి. వీటన్నిటిలో టీడీపీకి గెలుపు అవకాశాలు, గెలిచే సత్తా, గెలుపుపై ఆశలు ఉన్నవి రెండే రెండు కార్పొరేషన్లు (విజయవాడ, గుంటూరు) … ఎనిమిది మున్సిపాలిటీలు (కుప్పం, హిందూపురం తదితర..) మాత్రమే. వీటిలో విజయవాడలో టీడీపీ తమ కాంతిని తామే పొడుసుకుంటుంది. తమ పోయే కాలాన్ని తామే తెచ్చుకుంటుంది. తమ ఓటమి రాతని తామే రాసుకుంటుంది..!
Vijayawada TDP ; పార్టీ అంచనాలన్నీ ఇక్కడే..!
టీడీపీ అంచనాలు, ఆశలు విజయవాడపై ఎక్కువగానే ఉన్నాయి. అమరావతి రాజధాని ఉద్యమం తమకు బాగా కలిసి వస్తుందని టీడీపీ భావిస్తుంది. విజయవాడ నగరంలో టీడీపీకి కంచుకోటలంటే ప్రాంతాలు ఉండడం.. తమ అనుకూల కుల ఓట్లు బాగానే ఉండడం.., టీడీపీ హయాంలో విజయవాడలో కొన్ని కీలక పనులు చేయడం.. తమకు కచ్చితంగా ఓట్లు తెచ్చి పెడుతుందని టీడీపీ లెక్కలు వేసుకుంటుంది. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయవాడ ప్రాంతానికి వైసిపి చెందేమి లేదని.., పైగా అమరావతి రాజధాని సెంటిమెంట్ వైసిపికి చావు దెబ్బ కొడుతుందని టీడీపీ గట్టిగా నమ్ముతుంది. వైసిపికి విజయవాడలో ఉన్న నేతలు ముగ్గురే. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.., ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వల్లభనేని వంశి వర్గం మాత్రమే.. కానీ టీడీపీకి మాత్రం కేశినేని నాని సహా… బుద్ధా వెంకన్న, బోండా ఉమాతో పాటూ విజయవాడలో 15 శాతం వరకు ఉన్న ముస్లిం ఓట్లు రాబట్టేందుకు నాగూరుమీరా, జలీల్ ఖాన్ ఉన్నారు అని టీడీపీ నమ్ముతుంది. అందుకే భారీగా అంచనాలు వేసుకుని.. మొత్తం 64 డివిజన్లలో కనీసం 35 గెలుస్తామంటూ చెప్పుకుంటుంది. చంద్రబాబు ప్రచారం చేసారు. జనం బాగానే వచ్చారు. కానీ నాయకులు మాత్రం కలిసి రాలేదు.
కొట్లాటలతో ముప్పు ఎక్కువే…!!
విజయవాడలో టీడీపీ అంటే మొదట గుర్తొచ్చేది కేశినేని నాని. రెండుసార్లు ఎంపీగా గెలిచారు. స్థానికంగా పట్టుంది. ఆ తర్వాత బోండా ఉమా మహేశ్వరరావు.. ఒకసారి సెంట్రల్ ఎమ్మెల్యే… పార్టీ వాని బలంగా వినిపిస్తారు.. ఆ తర్వాత బుద్ధా వెంకన్న. పార్టీకి మంచి వాయిస్. ఈ ముగ్గురిలో మొదటి నేతకి… రెండో ఇద్దరు నేతలతో పడడం లేదు. వాళ్ళు ఏదో ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నట్టు ఒకరిపై ఒకరు సవాళ్లు.., ప్రతి సవాళ్లు… రెచ్చ గొట్టుకోవడాలు.. చేసుకుంటున్నారు. పనిలో పనిగా తమ లోపాలను, బలహీనతలను, కుల తతంగాలను కూడా బయట పెట్టేస్తున్నారు. ఎవరైనా, ఏమైనా అంటే ఇది మా కుటుంబ గొడవ అంటున్నారు. కానీ మైక్ ల ముందు, ప్రజల ముందు ఒకరినొకరు తక్కువ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. అందుకే అక్కడ ఇప్పుడు టీడీపీకి వచ్చే లాభం కంటే.. పోయే నష్టమే ఎక్కువగా ఉందట.
ఎవరి ప్రభావం ఎంత అంటే..!?
విజయవాడలో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. కేశినేని నాని నగరంలో ప్రభావితం చేయగల నాయకుడు. ఆయనకు 20 డివిజన్లలో మంచి పట్టుంది. పరిచయాలు ఉన్నాయి. ఆయన సొంత బలగం, పార్టీ పట్టుతో ఈ 20 డివిజన్ల గెలుపుని ఆయన బాధ్యత తీసుకోగలరు. కానీ అలా అని ఈ 20 మాత్రమే గెలిస్తే సరిపోదు. ఆయన కుమార్తె శ్వేతా ఈ 20 డివిజన్లతో మేయర్ అవ్వరు. బోండా ఉమాకి 6 డివిజన్లలో పట్టుంది.. బుద్ధ వెంకన్నకి మరో రెండు డివిజన్లలో పట్టుంది. నాగూర్ మీరా.., జలీల్ ఖాన్ లు ముస్లిం ఓట్లు ప్రభావితం చేయగలరు. సో… కేశినేని నాని మాత్రమే కాకుండా ఈ నాయకులు అందరూ కలిసి రావాలి.. వారికి ఆ పార్టీ తోడు ఉండాలి. కానీ ఇది గ్రహించలేక.. ఎవరికీ వారే పెద్ద లీడర్లు అన్నట్టు బిల్డప్ లకు పోవడం.. మైక్ ల ముందు నోరు విప్పుకోవడంతో పార్టీ మొత్తం కంపు కొట్టే పరిస్థితికి వచ్చేసింది. కార్యకర్తల్లో నీరసం ఆవహించి.. పని చేయాలన్న ఊపు తగ్గింది. ఫలితంగా.. బెజవాడలో టీడీపీకి చేటు తెచ్చింది..!!