(ఫైల్ ఫోటో)
అమరావతి: తాము ప్రజాతీర్పును గౌరవిస్తాం కానీ ట్యాంపరింగ్ చేసిన ఈవిఎల తీర్పును కాదని వినుకొండ టిడిపి అభ్యర్థి గోనుగుంట్ల వెంకట సీతారామాంజనేయులు పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఒక ఇవిఎంలోని మాయాజాలం బయటపడటంపై సందేహాన్ని వ్యక్తం చేశారు. 25వ నెంబర్ పోలింగ్ బూత్ ఈవిఎం లెక్కింపులో టిడిపికి కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది. ఇక్కడ వైసిపికి 173 ఓట్లు పోల్ అవ్వగా కాంగ్రెస్ పార్టీకి 492 ఓట్లు రావడం గమనార్హం. దీనిపై అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయగా ఆ ఈవిఎంకు సంబంధించిన వివి ప్యాట్ స్లిప్పులు లెక్కించారు. లెక్కింపులో టిడిపికి 195ఓట్లు వచ్చాయి. ఒక్క ఇవిఎంలోనే 194ఓట్లు వ్యత్యాసం ఉండటంతో అభ్యర్థి సీతారామాంజనేయులు నియోజకవర్గంలోని మొత్తం వివి ప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేశారు. ఆయన అభ్యర్థనను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో అభ్యర్థి సంతకం చేయకుండానే పోలింగ్ హాలు నుండి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా టిడిపి అభ్యర్థి రామాంజనేయులు మాట్లాడుతూ ఒక ఓటు టిడిపిది అయితే నాలుగు ఓట్లు వైసిపికి పడేలా ముందుగానే ఈవిఎంలను ప్రొగ్రామింగ్ చేశారనీ ఆరోపించారు. అందుకే ఆ పార్టీ అభ్యర్థులకు ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోల్ అయినట్లు ఈవిఎంలు చూపిస్తున్నాయని ఆంజనేయులు అన్నారు. అసలు ఇన్ని సీట్లలో వైసిపి గెలుస్తోందని జగన్ కూడా ఊహించలేదనీ, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని ఆంజనేయులు అన్నారు.