Visakha Politics : ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం మొత్తం మీద 12 నగర పాలక సంస్థలు.., 75 పురపాలక సంస్థలకు మార్చి 10 న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 14 న ఫలితాలు కౌంటింగ్ జరగనుంది. అటు శ్రీకాకుళం జిల్లా పలాస మొదలుకుని… ఇటు చిత్తూరు జిల్లా కుప్పం వరకు టీడీపీ గట్టిగా ఆశలు పెట్టుకున్నది.., వైసీపీ పూర్తిగా దృష్టి పెట్టిన కార్పొరేషన్లు మూడు ఉన్నాయి. ఇవి గెలిస్తే వైసీపీని నైతికంగా ఓడించేసినట్టే అని టీడీపీ భావిస్తుంది..! ఈ మూడు గెలిస్తే ఇక టీడీపీ రాష్ట్రంలో కనుమరుగైనట్టే అని వైసీపీ భావిస్తుంది..! ఇంతకు ఆ మూడు కార్పొరేషన్లు ఏంటి..? అక్కడ క్షేత్రస్థాయి రాజకీయాలు ఎలా ఉన్నాయి..!? అనేది “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తుంది..!!
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు అంటే విశాఖపట్నం.., విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలపై పార్టీల కన్ను ఉంది. ఈ మూడు గెలిచే అవకాశం కోసం ప్రతిపక్ష టీడీపీ ఎదురు చూస్తుంది. ఆశలు ఆ అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇవ్వకూడదు అని వైసీపీ అనుకుంటుంది. విశాఖలో రాజధాని అంశం కలిసి వస్తుందని వైసీపీ భావిస్తుండగా.., విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం అధికార పక్షానికి వ్యతిరేకంగా మారి తమకు రాజకీయంగా లాభిస్తుందని టీడీపీ అంచనా వేస్తుంది. విజయవాడ – గుంటూరు నగరాల్లో కూడా అమరావతి రాజధాని సెంటిమెంట్ ని రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ భావిస్తుంది. ఈ నగరాల్లో గెలిచి.. తమ పట్టు నిరూపించుకోవాలని వైసీపీ భావిస్తుంది..!!
Visakha Politics : విశాఖలో ఎలా ఉంది..!? ఏమనుకుంటున్నారు..!?
విశాఖ నగరంలో రాజకీయం రెండేళ్లుగా మెలికలు తిరుగుతుంది. విశాఖ నగరంలో వాస్తవ పరిస్థితులపై “న్యూస్ ఆర్బట్” క్షేత్ర పరిశీలన చేసింది. నాలుగు నెలల కిందట పరిస్థితులకు.. ఇప్పటి పరిస్థితులకు తేడా ఉంది. ఇలా ఇక్కడ ప్రతీ ఇష్యూ … ప్రజల్లో కొత్త ఆలోచనలు సృష్టింస్తుంది. ప్రస్తుతం మాత్రం స్తబ్దుగా ఉంది. జనంలో ఒక కన్ఫ్యూషన్ కూడా వచ్చేసింది. ఇది ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావితం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది..!
* 2019 ఎన్నికల సమయానికి విశాఖ నగరంలో టీడీపీకే పట్టుంది. రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి బలంగా వీచినప్పటికీ.. విశాఖ నగరంలో మాత్రం తెలుగు దేశం పట్టు నిరూపించుకుంది. నగరానికి నాలుగు దిక్కులా టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఆ సమయంలో మేయర్ ఎన్నికలు జరిగి ఉంటే పీఠం టీడీపీకి దక్కేది. ఆ ఎన్నికలు ముగిసిన 7 నెలల్లో విశాఖలో రాజధాని అంటూ ప్రభుత్వం ప్రకటించడంతో గాలి ఇటు మళ్లింది.
* “మాకు రాజధాని వస్తుంది. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది”.. అంటూ 2019 డిసెంబర్ నుండి 2020 జూన్ మధ్య కాలంలో వైసీపీ వైపు గాలి మళ్లింది. జనంలో చర్చ మొదలయింది. ఆ సమయంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగి ఉంటే పీఠం ఏకపక్షంగా వైసిపికి దక్కేది.
* “రాజధాని ప్రకటించి ఇన్ని నెలలు అయింది. ఏదీ జరగడం లేదు. అన్నీ కోర్టుల్లో ఆగిపోతున్నాయి. మా విశాఖ రాజధాని అంశం కూడా కోర్టుల్లో ఆగిపోతుందేమో”.. అంటూ కొన్నాళ్ళు నిస్పృహ నెలకొంది.
* “సరే… రాజధాని తరలించడానికి కోర్టుల్లో అడ్డం ఉంది. కనీసం సీఎం జగన్ విశాఖపై, విశాఖలో పారిశ్రామికంపై.., విశాఖలో ఉపాధి అవకాశాలపై, విశాఖలో ప్రగతిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు. పైగా రాజధాని అని చెప్పినప్పటి నుండి భూముల ధరలు పెరిగాయి తప్ప ఇంకేం మార్పులు లేవు.. ఇది రాజకీయ డ్రామానా..?” అంటూ 2020 ఆగష్టు – 2021 జనవరి మధ్యలో చర్చ జరిగింది. ఈ సమయంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగి ఉంటే టీడీపీ పోటీ ఇచ్చేది.. కానీ మేయర్ పీఠం మాత్రం వైసిపికే దక్కేది..!
* తాజాగా రాజధాని చర్చ కాస్త… విశాఖ ఉక్కు ఉద్యమంపైకి మళ్లింది. సో.. 2019 డిసెంబర్ నుండి 2021 ఫిబ్రవరి వరకు విశాఖ ఒక గందరగోళంలో చిక్కుకుంది. అక్కడి ఓటర్లు ఒక కన్ఫ్యూషన్ లో చిక్కుకున్నారు. అందుకే రకరకాల ఆలోచనలు.. రకరకాల చర్చలతో రాజకీయ డైలమాలోకి వెళ్లిపోయారు..!!
బీజేపీ లేనట్టే..! టీడీపీ X వైసీపీ గట్టిగానే..!?
విశాఖలో మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. టీడీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు పుష్కలంగా ఉన్న డివిజన్లు 13 ఉండగా.. వైసీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న డివిజన్లు 20 వరకు ఉన్నాయి. అంటే… సింపుల్ గా ఇప్పుడున్న అంచనాల ప్రకారం టీడీపీకి 13 .., వైసీపీకి 20 డివిజన్లు రావడం పక్కా..! కానీ వైసీపీ మొత్తం 75 స్థానాల్లో గెలవడం లక్ష్యంగా పెట్టుకుంది. టీడీపీ 55 స్థానాల్లో గెలుస్తామంటూ గట్టి నమ్మకంతో ఉంది. టీడీపీకి ఉన్న పెద్ద దిక్కు ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ మాత్రమే. బండారు సత్యన్నారాయమూర్తి, అయ్యన్న పాత్రుడు ప్రభావం నగరంపై తక్కువగానే ఉంటుంది. వైసిపిలో మాత్రం విజయసాయిరెడ్డి, అవంతి సహా… కీలక నేతల కన్ను ఉంది. పైగా 6 డివిజన్లలో గెలుపుని శాసించగల విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని ఈ ఎన్నికల్లో సైలెంట్ చేసి.. ఆయన వర్గం ద్వారా అధికార పార్టీకి పని చేయించే ప్రణాళికల్లో ఉంది. సో… వైసీపీ మాత్రం ఈ గెలుపుపై ధీమాగా ఉండగా.. టీడీపీ మాత్రం విశాఖ ఉక్కు ఉద్యమ సెంటిమెంట్ ని వాడుకుని గెలవాలి అని రాజకీయం మొదలు పెట్టింది. రెండు నెలల కిందట వరకు పక్కాగా నాలుగు డివిజన్లలో ఓట్లు వస్తాయి అనుకున్న బీజేపీ ప్రస్తుతం విశాఖలో లేనట్టే. కాకపోతే జనసేనకు కొన్ని డివిజన్లలో సామాజికవర్గ అండ ఉంది. జనసేన – బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తే… వారిపై విశాఖ ఉక్కు ఉద్యమ ప్రభావం లేకపోతే మూడు డివిజన్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి..!!
(గుంటూరు , విజయవాడ నగరాల్లో రాజకీయ పరిస్థితులను వచ్చే కథనంలో చూద్దాం)