ఆ అధినేత ఆశలు పెట్టుకున్నారు. తిరిగారు. ఆ మూడు జిల్లాలపై బాగా దృష్టి పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. తర్వాత ఆ నియోజకవర్గం మొహం కూడా చూడలేదు. ఆయన తరపున పని చేసిన నాయకుల కృతజ్ఞత సభ కూడా పెట్టలేదు. చివరికి ఏముంటుంది..!? బోర్డు తిప్పేసి పరిస్థితి వచ్చేసింది. కాబోయే రాజధాని (అంతా సవ్యంగా జరిగితేనే) విశాఖలో జనసేన పరిస్థితి ఇదీ..! గాజువాక కాదు కదా.., ఈస్టు, వెస్టు సహా నాలుగు దిక్కుల్లోనూ.., గ్రామాల్లోనూ ఆ పార్టీ నీడలు కూడా కనిపించడం లేదు..! ఈ పరిస్థితికి కారణాలు.., విశాఖలో క్షేత్రస్థాయిలో జనసేన పట్ల అభిప్రాయాలు “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక క్షేత్ర పరిశీలన ద్వారా అందిస్తుంది..!!
సేఫ్ జోన్ చూసుకున్నా ఓటమే..!
2019 ఎన్నికల్లో గాజువాక నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారా..? ఏం నిర్ణయం తీసుకుంటారా..? అని ఎదురు చుసిన శ్రేణులకు పవన్ కళ్యాణ్ ఒక షాక్ ఇస్తూ గాజువాక, భీమవరం నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకో తెలుసా..!? ఈ రెండూ నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేసేవి కాపు సామాజికవర్గం ఓట్లే. తాను ఒక కులానికి వ్యతిరేకం అంటూనే.. ఆయన సేఫ్ జోన్ చూసుకున్నారు. కానీ రెండు చోట్లా ఓడిపోయారు. దీనిలో గాజువాక అయితే 2009 లో ప్రజారాజ్యం గెలిచినా స్థానం. ఆ అన్నయ్య నీడలో రాజకీయ జాడని వెతుక్కున్న పవన్ కి దీని కంటే సేఫ్ నియోజకవర్గం లేదు. కానీ ఇక్కడా ఓడిపోయారు. కాలం కలిసి రాలేదు. ఓటర్లు నమ్మలేదు. అర్ధం లేని అరుపులకు ఓట్లు రాలలేదు. చివరికి 16 వేలకి పైగా తేడాతో ఓడిపోయారు. అక్కడితో ముగిసింది. మంగళగిరిలో నారా లోకేష్ కూడా ఓడిపోయారు.
మళ్ళీ గాజువాక ఎన్నిసార్లు వెళ్ళావు పవన్..!?
ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమే. ఒదిన చోటనే రాబట్టుకోవడం సద్గుణం కూడా. అందుకే ఏది ఏమైనా నారా లోకేష్ మంగళగిరికి అంటిపెట్టుకుని ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆరు సార్లు మంగళగిరిలో లోకేష్ తిరిగారు. అక్కడ టీడీపీ నేతల పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు. నారా లోకేష్ పప్పులు ఉడుకుతున్నాయా..? లేదా..? అనేది పక్కన పెట్టేస్తే ఆయన మంగళగిరికి ఫిక్స్ అయిన మాట మాత్రం నిజం. మరి పవన్ ఏం చేశారు..? ఓడిన తర్వాత మళ్ళీ గాజువాక మొఖం చూడలేదు. అటు వెళ్ళలేదు. కేవలం 2019 నవంబరులో ఇసుక పాలసీమీద మాత్రం ర్యాలీ చేసారు. ఇది కూడా గాజువాకకి ప్రత్యేకం ఏమి కాదు. అలా ఓడిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని ఒక్కసారి కూడా చూడని నాయకుడిగా ప్రవం కళ్యాణ్ ప్రత్యేకత సంతరించుకున్నారు. అందుకే అక్కడి నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు మాత్రం ఎందుకు ఊరుకుంటారు..! పవన్ కళ్యాణ్ అంటే ఇదేనా..? అనుకుంటూ జెండాలు వదిలేశారు. బోర్డులు తిప్పేశారు. అలా అలా విశాఖ నగరం మొత్తం ఇదే జరుగుతుంది. నిలకడ లేమి, అపరిపక్వత, సినిమాటిక్ రాజకీయాలతో విశాఖలో పవన్ పోగొట్టుకున్నది ఇదే..! ఇక విశాఖలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పరిస్థితి ఓ సారి చూస్తే..!!
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..!?
ప్రస్తుతం విశాఖలో జనసేన పరిస్థితి ఏమిటి..? గాజువాకలో ద్వితీయ శ్రేణి నాయకులు ఏం చేస్తున్నారు..? పవన్ కళ్యాణ్ ని నమ్మిన నాయకులు ప్రస్తుతం ఎలా ఉన్నారు..? గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుంది..? అనేది పరిశీలిస్తే..! విశాఖలో జనసేన పార్టీకి పూర్తిస్థాయి నాయకులు లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన తరహాలోనే చింతల పార్ధసారధి, గేదెల శ్రీనుబాబు, పంచకర్ల సందీప్, ఉష కిరణ్, సుందరపు విజయ్ కుమార్, నక్క రమేష్ తదితర నియోజకవర్గ నేతలు కూడా దూరమయ్యారు. కొందరు వైసిపిలో చేరగా.. కొందరు సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం గ్రేటర్ విశాఖలో జనసేన తరపున గట్టిగా నిలబడే నాయకులు లేరు. ఆర్ధికంగా, పార్టీ పరంగా, రాజకీయంగా భరోసా ఇచ్చే సరైన నాయకులు ఒక్కరు కూడా లేరు. అందుకే విశాఖలోని 98 డివిజన్లలో జనసేనకు దాదాపు 50 డివిజన్లలో సరైన (జనంలో పట్టున్న) అభ్యర్థులు కూడా దొరికే అవకాశం లేదు. మిగిలిన డివిజన్లలో కూడా అంతంతమాత్రమే. ఒకవేళ జనసేన – బీజేపీ కలిసి పోటీ చేసి.. పవన్ కళ్యాణ్ గట్టిగా తిరిగితే విశాఖలో బీజేపీ సహకారంతో జనసేన రెండు లేదా మూడు డివిజన్లు గెలుచుకునే వీలుంది అనేది స్థానికంగా వినిపిస్తున్న విశ్లేషణ.