(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవాలని చూస్తున్నారని, విశాఖను పరిపాలన కేంద్రం చేయాలన్న ఉద్దేశాన్ని నీరుగార్చాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేయాలనే ధోరణి టీడీపీలో కనిపిస్తోందని మండిపడ్డారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని వస్తే తమ జీవితాల్లో వెలుగు వస్తుందని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసిస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘అభివృద్ధి ప్రదాత జగన్ గారికి థాంక్స్ చెబుతూ.. బీచ్ లో ఎగిసిపడే అలల్లా.. విశాఖ వీధులన్నీ జనసంద్రంతో ఉప్పొంగాయి. ఇదే కదా అభిమానం.. ఇది కదా విశ్వాసం’ అని ట్విట్లర్ లో పేర్కొన్నారు.
విశాఖకు కార్యనిర్వహక రాజధాని వస్తే తమ జీవితాల్లో వెలుగు వస్తుందని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. అభివృద్ధి ప్రదాత జగన్ గారికి థాంక్స్ చెబుతూ.. బీచ్ లో ఎగిసిపడే అలల్లా.. విశాఖ వీధులన్నీ జనసంద్రంతో ఉప్పొంగాయి. ఇదే కదా అభిమనం.. ఇది కదా విశ్వాసం. pic.twitter.com/2quCZGrLuA
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 29, 2019
ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేసిన అనంతరం ఆయన తొలిసారి శనివారం విశాఖపట్నంలో పర్యటించిన విషయం తెలిసిందే. విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏ విధమైన సందేశం ఇవ్వకుండానే స్టేజ్ దిగి వెళ్లిపోయారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు, సందర్శకులు హాజరయ్యారు. కార్యక్రమం తరువాత సీఎం జగన్ మాట్లాడతారని, విశాఖకు మరిన్ని వరాలను ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే, జగన్ మాత్రం ఎలాంటి ప్రసంగం చేయకుండానే వెళ్లిపోవడం విశాఖవాసులను నిరాశకు గురిచేసింది.