రాజధాని.., కోర్టులు.., కనకదుర్గ వంతెన.., చావులు.., దళితులపై దాడులు.. కరోనా…!! ఇలా రాష్ట్రంలో రాజకీయం కానిది లేదు. ప్రభుత్వ/ ప్రతిపక్షాలు కత్తులు నూరుకుని దూసుకుంటున్నాయి. దీని కారణంగా రాష్ట్రానికి చేటు చేసేవి కూడా ఉంటాయి. అన్నీ రాజకీయ వివాదాలుగా మారితే వాటి ప్రయోజనం దెబ్బతిని, ఫలితం అందదు…! విశాఖలోని మెడ్ టెక్ ఆ కోవలోకే వస్తుంది.!!
సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా తాము చేసే అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక ప్రగతి తదితర విషయాలను ప్రజలకు వివరించడం సహజమే. ఒక రక్షణ శాఖకు సంబంధించిన విషయాలను మాత్రమే గోప్యంగా ఉంచుతుంటారు. కానీ ప్రస్తుతం వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం మాత్రం ఎందుకో ఓ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతోంది. ఎందుకు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అదేంటో తెలుసుకోవాలంటే విశాఖ జిల్లా గాజువాక వెళ్లాల్సిందే..!!
మెడ్ టెక్ ఏర్పాటు మంచిదేగా..!!?
గాజువాక సమీపంలోని పెద గంట్యాడ మండలంలో 2018 డిసెంబరులో నాటి సీఎం చంద్రబాబు నేతృత్వంలో మెడ్ టెక్ జోన్ ప్రారంభించింది. స్వదేశీ పరిజ్ఞానంతో వైద్య పరికరాలను తయారు చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు మనకు కావాల్సిన వైద్య పరికరాల్లో 98 శాతం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని అధిగమించేందుకు గత ప్రభుత్వ హయాంలో దీన్ని నెలకొల్పారు. దీనిలో 18 రకాల అత్యున్నత స్థాయి లేబరేటరీలను నెలకొల్పారు. ఇందులో 15 ప్రభుత్వరంగ సంస్థలు, ఆరు అంతర్జాతీయ సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. 70 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నెలకొల్పిన ఈ మెడ్ టెక్ జోన్ లో తొలి విడతగా తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. దాదాపు 25వేల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. మంచిదే, ఏర్పాటు, ఉద్దేశం అన్నీ మంచివే..!!
సైలెంట్ చేసేసారు..!! కనీసం బయటకు లేదు..!
ఈ మెడ్ టెక్ జోన్ లో ప్రస్తుతం అనేక రకాల వైద్య పరికరాల తయారీ జరుగుతోంది. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన పిపిఈ కిట్లు, వెంటిలేటర్లు తదితర వస్తువులు తయారు చేస్తున్నారు. అయితే ఆ మెడ్ టెక్ జోన్ లో తయారు అవుతున్న ఉత్పత్తుల వివరాలు, ఎన్ని కంపెనీలు ఉన్నాయి. ఎంత మంది ఉపాధి పొందుతున్నారు. ఇతర అంశాలు అన్నీ రహస్యంగానే ఉంచుతున్నారు. ఆ మెడ్ టెక్ జోన్ లోకి బయట వ్యక్తులకు ప్రవేశం లేదు. లోపల ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పరు. వివరాల కోసం అధికారులను సంప్రదించినా స్పందించరు. సమాధానం ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా…? ఇది చంద్రబాబు హయాంలో నెలకొల్పింది. ఇక్కడ ఏమైనా కొంచెం ప్రగతి కనిపించినా, బయటకు వచ్చినా చంద్రబాబు దాన్ని పాతికేళ్ళు పదే పదే చెప్పుకుంటారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ తరహాలో ఏపీలో దీన్ని చంద్రబాబు తనదేనని చెప్తారు. అది ఇష్టం లేని వైసీపీ దీని వ్యావహారాలను గోప్యంగా ఉంచుతుంది. ఈ గోప్యత మంచిదే..! కానీ ఎవరైనా పిటిషన్ వేసి, అల్లరి చేసిం వివాదంలోకి లాగని వరకే మంచిది. అది జరిగితే, ప్రభుత్వానికే ఎంతో కొంత మచ్చ పడుతుంది. అందుకే జగనే స్వయంగా ఓ సారి వెళ్లి, చూసి తానే చేయిస్తున్నట్టు చెప్పుకోవచ్చుగా…!! జనాలకు కూడా అది ఉన్నట్టు, పని చేస్తున్నట్టు తెలుస్తుంది..!