భారత రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ హవా కొనసాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలను శాసిస్తోంది. రాజకీయాలతోపాటు సోషల్ మీడియాను కూడా శాసిస్తోందా.. అంటే అవుననే అంటోంది అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక. ఈమేరకు తన కథనంలో పేర్కొంది. బీజేపీ నాయకులు చేస్తున్న వివాదాస్పద పోస్టులపై ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని సంచలనాత్మక కథనం ప్రచురుంచింది. భారత్ ప్రభుత్వంతో ఇబ్బందులు రాకూడదనే బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవట్లేదని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్టుల గురించి ప్రస్తావించింది.
రాజాసింగ్ తన ఫేస్ బుక్ పోస్టుల్లో వివాదాస్పద దీడియోలు, పోస్టులు ఉన్నా చర్యలు తీసుకోలేదు. బీజేపీతో తగువెందుకు అని ఫేస్ బుక్ ఇండియా ఉన్నతాధికారి అంకిత్ దాస్ భావించడమే కారణం అంటూ ప్రచురించింది. హింసను ప్రేరేపించే ఈ పోస్టులు, వీడియోలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని తాము ప్రశ్నించాకే రాజాసింగ్ అకౌంట్ నుంచి కొన్ని పోస్టులతోపాటు బ్లూ టిక్ బ్యాడ్జ్ ను తొలగించిందని పేర్కొంది. పైకి వివాదాస్పద పోస్టులను తొలగిస్తాం.. ఇటువంటి వాటిని సహించేది లేదు అని వ్యాఖ్యలు చేస్తున్న అంకిత్ దాస్ చర్యలు తీసుకోవటం లేదని రాసింది. కర్ణాటక ఎంపీ అనంత్ కుమార్ ఆమధ్య ట్విట్టర్ లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ట్విట్టర్ తొలగించింది. ఫేస్ బుక్ మాత్రం వీటిపై ప్రశ్నిస్తేనే స్పందిస్తోందని రాసింది.
వీటన్నింటినీ ఫేస్ బుక్ మాజీ అధికారులు కొందరు ధ్రువీకరిస్తున్నారు. మోదీతో సత్సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ బీజేపీ, సంఘ్ పరివార్ కార్యకర్తలు చేసే వివాదాస్పద పోస్టులను చూసి చూడనట్టు వదిలేస్తోందని తన కథనంలో రాసింది. 2019 ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి అనుకూలంగానే అంకిత్ దాస్ పని చేశారని కూడా రాసింది. కొందరు కాంగ్రెస్ పార్టీ నేతల పేజీలను తొలగించినా బీజేపీ నేతల పేజీల జోలికి ఫేస్ బుక్ వెళ్లలేదని తెలిపింది. మరోవైపు.. ఫేస్ బుక్ పై ఆరోపణల్లో వాస్తవాలుంటే సమన్లు జారీ చేస్తామని కేంద్రం అంటోంది.