ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడు అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ దొరికింది.
14 షరతులు, లక్ష రూపాయల పూచీకత్తుతో కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఏం జరగబోతోందనే చర్చ తెరమీదకు వచ్చింది.
చేపల మార్కెట్ వద్ద పట్టపగలే….
ఈ ఏడాది జూన్ 29న మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద పట్టపగలు వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కరరావును దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కుట్ర దారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏ–4 నిందితుడిగా అరెస్ట్ చేశారు. అయితే, ఆయన పోలీసులకు దొరకలేదు. కారులో విశాఖ వెళ్తూండగా తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఆయన్ను తునిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మాజీ మంత్రి బయటకు వస్తే ఏం జరుగుతుందంటే….
అయితే, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్లు పలు మార్లు దాఖలు చేసుకున్నారు. అయితే, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అతనికి బెయిల్ ఇవ్వరాదని తేల్చి చెప్పారు. కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది. తాజాగా ఆయనకు కృష్ణా జిల్లా కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.
షరతులు పెట్టినందుకే….
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 షరతులతో, లక్ష రూపాయలు పూచికత్తుతో ఆయనకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, కోర్టు ఆదేశాలతో మంగళవారం జైలు నుండి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, విజయవాడలోనే ఉండాలనే షరతుల నేపథ్యంలో ఆయన్ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలుస్తారా లేకపోతే పార్టీ నేతలతో సమావేశం ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది.