బెజవాడ నగరంలో ఒక్కసారిగా తుపాకులు పేలాయి ..పెట్రోలు మంటలు ఎగిసి పడ్డాయి… రెండు రోజుల వ్యవధిలో రెండు ఘోరమైన నేరాలు జరిగిపోయాయి. ఇటీవలి కాలంలో కామ్ గా ఉన్న బెజవాడ ఉన్నట్టుండి క్రైమ్ హాట్స్పాట్ గా ఎందుకు మారిపోయింది?ఆ నగరానికి ఏమైంది ?
అన్నదే ఇప్పుడు అందరినీ ఆందోళన గురిచేస్తున్న అంశం.రెండు మూడు నెలల క్రితం రెండు గ్యాంగ్ స్టర్ ముఠాలు నడిరోడ్డు మీదే కొట్టుకుని ఒక యువకుడిని హత్య చేయటం తెలిసిందే.ఆ తర్వాత అలాంటి సంఘటనలు జరగలేదు.నగరంలో కి అదుపులోకి వచ్చిందని అందరూ భావిస్తున్న తరుణంలో శనివారం రాత్రి పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి మహేష్ ను నున్న సమీపంలోని మామిడి తోటల్లో దుండగులు తుపాకీ తో కాల్చి చంపారు. సరే …ఇందుకు దారితీసిన కారణాలు, ఇతర వివరాలను పక్కనబెడితే ఒక ముఠా కారులో తుపాకీతో సంచరిస్తూ ఏకంగా పోలీసు శాఖ ఉద్యోగిని కాల్చి చంపిన విషయం చిన్నది కాదు.
విజయవాడ లాంటి మహా నగరంలో పోలీసు శాఖ ఎంత అప్రమత్తంగా ఉందో ఈ సంఘటన చెప్పకనే చెపుతోంది.ఇది జరిగి రెండు రోజులు కాకముందే సోమవారం రాత్రి ఒక యువతిని అదే విజయవాడలో నడి రోడ్డు మీద మరో యువకుడు పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు.ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసి ఆ యువతి కాదనడంతో సదరు యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి ఒక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా ఆమె వెంట పడి నాగభూషణం అనే యువకుడు వేధింపులకు గురిచేశాడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నాగభూషణానికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆమె ఫిర్యాదును ఉపసంహరించుకుంది.
ఆయితే పోలీసుల ముందు నటించిన నాగభూషణం చిన్నారిపై ఇంకా కోపం పెంచుకున్నాడు తన ప్రేమను కాదనడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని అవమానకరంగా భావించి సోమవారం రాత్రి చిన్నారి ఆస్పత్రి నుండి విధులు ముగించుకుని వస్తుండగా మార్గ మధ్యంలో అడ్డగించి నాగభూషణం ఆమెపై పెట్రోలు పోసి తగలబెట్టేశాడు.అక్కడికక్కడే మంటల్లో చిన్నారి బుగ్గిఅయిపోయింది.నాగభూషణం కూడా తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు.ఈ రెండు సంఘటనలు విజయవాడ పోలీసుల శక్తి సామర్ధ్యాలను శంకించేవిగా ఉన్నాయడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఇలాంటి నేరాలు జరుగుతుంటే ఇక వాటిని ఆపేదెవరు?