టీడీపీ నుండి వైసీపీకి ఎమ్మెల్యేలు జంప్ అవ్వడం ఇప్పటి వరకు చూసాం..! బట్ ఫర్ ఆ చేంజ్… ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే టీడీపీ లేదా బీజేపీలో చేరడానికి సిద్ధపడుతున్నారట. అధికార పార్టీలో అంతర్గత రాజకీయాలు.., పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం.., జిల్లాలో కొందరు నేతల పెత్తనం.. తట్టుకోలేక ఆయన పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం జగన్ కూడా దీన్ని తేలిగ్గా వదలడం లేదు. ఆయన స్థాయిలో ఓ కీలక నివేదిక సిద్ధం చేసుకుని.., త్వరలోనే ఎమ్మెల్యేలతో భేటీ అవుతారని సమాచారం. ఇంతకూ పార్టీని వీడుతానంటున్న ఎమ్మెల్యే ఎవరు..? ఏమైంది..? ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ ప్రణాళికలు ఏమిటి అనేది చూద్దాం..!!
నెల్లూరు జిల్లాలో వైసీపీలో అంతర్గత రాజకీయాలు జోరుగా ఉన్నాయి. ఇద్దరు మంత్రులు.. సీనియర్ ఎమ్మెల్యేలు జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే ఆనం రామనారాయణరెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యే కొంతకాలం కిందట అసమ్మతి స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యే పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మరో ట్విస్టు ఏమిటంటే.. ఆయనను పార్టీ నుండి తరిమేయడానికి పార్టీలోని కొందరు నాయకులే పొమ్మనలేక పొగపెడుతున్నారని కూడా జిల్లాలో చర్చ జరుగుతుంది. ఈయన ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారు, కమీషన్లు ఎక్కువ అడుగుతున్నారు అంటూ వైసీపీ కార్యకర్తలే ఇటీవల ఆయన నివాసం వద్ద ధర్నా చేయడం కొసమెరుపు.
బీజేపీ లేదా టీడీపీ.. ఆపై ఎంపీగా..!!
సదరు ఎమ్మెల్యే గతంలో ఎంపీగానూ పని చేసారు. 2014 లో వైసీపీ నుండి గెలిచారు. 2019 లో మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు పార్టీలో అంతర్గత కారణాలతో పార్టీని వీడి.., టీడీపీ లేదా బీజేపీ కి వెళ్లి మళ్ళీ తాను ఎంపీగా గెలిచినా నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు బీజేపీ పెద్దలతో చర్చలు కూడా జరిపారని జిల్లాలో చర్చ జరుగుతుంది. అయితే అధికారంలో ఉంటూ.., ఎమ్మెల్యేగా హోదాను అనుభవిస్తూ రాజీనామా చేసి.., పార్టీ మారి, మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం అంటే అతి పెద్ద రిస్కు. సో.., ఈ పుకార్లలో అంత నిజాలు లేకపోవచ్చు కానీ…, ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉండడం.., పార్టీ ఈయనపై అసంతృప్తిగా ఉండడం మాత్రం నూటికి నూరుపాళ్లు వాస్తవమే.!
జగన్ దగ్గర జాబితా..!?
అయితే ఇవన్నీ సీఎం జగన్ కి తెలియక కాదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏడాదిన్నర గడుస్తుంది. ఇప్పటికే మూడు దశల్లో నిఘా వర్గాల ద్వారా జిల్లా స్థాయిలో కీలక సమాచారం సేకరించారు. జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం తదితర వివరాలను సేకరించి పెట్టుకున్నారు. సంక్రాంతి తర్వాత నుండి జగన్ పార్టీపై కూడా దృష్టి పెట్టి వారానికి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేతో మాట్లాడతారని అంటున్నారు. అవినీతిలో, అసంతృప్తిలో ముందున్న ఎమ్మెల్యేలు… ప్రజలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలను మొదటి దశలో పిలిపించి నేరుగా మాట్లాడతారని సమాచారం. ఎవరెవరు పక్క పార్టీలతో టచ్ లో ఉన్నారు..? ఎవరు కోవర్టులుగా ఉన్నారు..? ఎవరు అసంతృప్తిని వినిపిస్తున్నారు..? ఎవరు చెడు ప్రచారం చేస్తున్నారు..? అనే దిశలో ఓ కీలక నివేదికను ఇప్పటికే సిద్ధం చేశారు.